హైదరాబాద్ : పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద తెలంగాణ హైర్ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాధికారులకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యజమానులకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా బకాయిపడిన సుమారు రూ.170 కోట్ల నిధులను విడుదల చేయాలని వాహనాల యజమానులు డిమాండ్ చేశారు. హైర్ వెహికల్స్ అసోసియేషన్ సమ్మెతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 వేలకు పైగా అద్దె వాహనాలు నిలిచిపోయాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రతినెలా ఇవ్వాల్సిన అద్దెను రూ.34 వేల నుంచి రూ.55 వేలకు పెంచాలని, అద్దె బిల్లులు ఐదో తేదీ నుండి పదో తేదీలోపు చెల్లించాలలని కోరారు. బిల్లులు చెల్లించక పోవడంతో డీజిల్ ఖర్చులు, డ్రైవర్ల జీతాలు, వాహనాల ఇన్సూరెన్స్, ఈఎంఐలు చెల్లించలేక సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.