బోనకల్లు, ఫిబ్రవరి 10 : అదునుకు నాగార్జునసాగర్ నీరు అందకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయంటూ తెలంగాణ, ఏపీ రైతులు ఆందోళనకు దిగారు. దాములూరు మేజర్ పరిధి ఆంధ్రా ప్రాంత రైతులతోపాటు తెలంగాణలోని బోనకల్లు మండలం దేశినేనిపాలెం, అల్లీనాగారం, మడుపల్లి గ్రామాల రైతులు ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు రహదారిపై మంగళవారం బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. సాగర్ నీటిని ఎడమ కాలువ ద్వారా నిలిపివేయడంతో బీబీసీ (బోనకల్ బ్రాంచ్ కెనాల్) పరిధి ఏపీలోని దాములూరు, మధిర మేజర్ కాలువల పరిధిలోని ఆయకట్టు భూములకు నీరందడం లేదని వాపోయారు.
ప్రస్తుతానికి బీబీసీ కెనాల్కు 1,370 క్యూసెకుల నీరు సరఫరా కావాల్సి ఉండగా.. 1,100 క్యూసెకుల నీరు మాత్రమే వస్తున్నదని, దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో రోడ్డెక్కాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు, నీటిపారుదల శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరగా సాగర్ నీరు విడుదల చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.