హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే యాదవుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన యాదవుల హక్కుల పోరాట సమితి మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాజకీయంగా, సామాజికంగా తెలంగాణ రాష్ట్రంలోనే యాదవులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాదవులకు ఐదు ఎమ్మెల్యే సీట్లు, ఒక రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అంతేకాకుండా సంక్షేమ భవనం కోసం కోకాపేటలో 250 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమి, భవనం నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు.
బడుగు, బలహీన వర్గాల పిల్లల విద్య కోసం రాష్ట్రంలో 200 రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి ఉచితంగా విద్య, పుస్తకాలు, అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తరగతులను ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. యాదవులు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.