ఉద్యోగులకు అస్సాం సీఎం హెచ్చరిక
గౌహతి, జనవరి 3: నూతన సంవత్సరం సందర్భంగా అస్సాంలో ఉద్యోగులు నాలుగు రోజులపాటు వారి తల్లిదండ్రులతో లేదా అత్తమామలతో గడిపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వీలుకల్పించింది. ఇందుకోసం గురు, శుక్ర వారాల్లో (ఈ నెల 6, 7న) సెలవు తీసుకొనేందుకు అనుమతించింది. వీటికి వారాంతపు సెలవులు (శని, ఆదివారం) కూడా కలిసి రావడంతో మొత్తం సెలవుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ ప్రత్యేక సెలవుల విషయంలో ఉద్యోగులు ప్రభుత్వాన్ని మోసగించేందుకు ప్రయత్నించరాదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హెచ్చరించారు. సెలవు పొందాలనుకొనేవారు ఈ నాలుగు రోజులపాటు తల్లిదండ్రులు లేదా అత్తమామలతో గడిపినట్టు రుజువు చేయాల్సిందేనని, అందుకు డజను ఫొటోలను సమర్పించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.