ఉజ్జయిని : రక్షబంధన్ సందర్భంగా మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని జ్యోతిర్లింగ క్షేత్రం మహాకాళేశ్వరుడి ఆలయంలో ఆదివారం వేకువ జామున భస్మ హారతి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు స్వామి వారికి జలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం మహాకాళేశ్వరుడిని అలంకరించారు. ఆ తర్వాత రాఖీ కట్టి.. లడ్డూలను నైవేద్యంగా నివేదించారు. కొవిడ్ నేపథ్యంలో హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి ఇవ్వలేదు. విశ్వ మానవాళిని కాపాడాలని మహాకాళేశ్వరుడికి రాఖీ కట్టి, ప్రార్థించినట్లు ఆలయ పూజారి ఒకరు తెలిపారు.