రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తమ వాణిని వినిపించనున్నారు. నియోజకవర్గాల్లోని పెండింగ్ పనులు, ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అధ్యక్షా అని వాణి వినిపిస్తూ అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరనున్నారు. గత సమావేశాల్లో కూడా అనేక సమస్యలను సభా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకున్నారు. ఈసారి కూడా అభివృద్ధే ఎజెండాగా ముందుకు సాగనున్నారు.
మంచిర్యాల, మార్చి 6(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన మంచిర్యాలలో 18 మండలాలు.. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు స్వరాష్ట్రంలో పరిష్కారమవుతున్నాయి. ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, అజ్మీరా రేఖానాయక్ తమ నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. విద్య, వైద్యంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, రైతుల సమస్యలు, సాగు నీటి సమస్యలపై ప్రజల ఇబ్బందులను ఏటా సభదృష్టికి తీసుకెళ్తున్నారు. ఏండ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. కరోనా కష్టకాలంలోనూ తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకున్నా తమ ప్రజల బాగోగుల కోసం జిల్లా ప్రజాప్రతినిధులు శ్రమిస్తున్నారు. నేటి(సోమవారం) నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తమ గళాన్ని వినిపించనున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పలువురు ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గంలోని సమస్యలు, పెండింగ్ అభివృవృద్ధి పనులు, నిధుల మంజూరుపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు సమస్యలు, అందుకు అవసరమైన నిధుల మంజూరు విషయమై ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకరానున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా. చెన్నూర్కు వంద కోట్లు, మందమర్రి క్యాతనపల్లి మున్సిపాలిటీ కోసం రూ.122.53 కోట్లు కేటాయించాం. పట్టణంలోని సీసీ రోడ్ల కోసమే రూ.20 కోట్లు కేటాయించాం. ప్రజల చిరకాల స్వప్నం రైల్వే ఓవర్ బ్రిడ్జి రూ.27.50 కోట్లతో నిర్మిస్తున్నాం. అదనంగా రూ.3.50 కోట్లు సమకూర్చాం. రూ.15.15 కోట్లతో 286 డబుల్ బెడ్ రూం ఇండ్లు దాదాపు పూర్తి కావచ్చాయి. రూ.159 కోట్లతో మందమర్రి పట్టణంలో, వంద కోట్లకు పైగా నిధులతో చెన్నూర్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఊరూరా మహిళా భవనాలకు శంకుస్థాపనలు చేశాం. సెంట్రల్ లైటింగ్, స్కిల్ డెవలప్మెంట్, గ్రంథాలయం, కేసీఆర్ పార్కులు, అధునాతన హాస్పిటల్స్ భవనం, మినీ ట్యాంక్ బండ్లు, రోడ్డు వెడల్పు పనులు, అంబేద్కర్ స్టడీ సర్కిల్తోపాటు అనేక పనులు చురుగ్గా సాగుతున్నాయి. కాళేశ్వరం జలాలతో నియోజకవర్గ రైతుల పొలాలు సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నా. చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్తో లక్ష ఎకరాలకు సాగు నీరందించడమే ముందున్న ప్రధాన లక్ష్యం.
– బాల్క సుమన్, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే