చేసేందుకు పూనుకున్నాయి. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల పేరుతో పచ్చని అటవీ భూములను నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా హెచ్ఎండీఏ పరిధిలోని కొన్ని ఫారెస్ట్ బ్లాకుల గుండా భారీ రహదారులను నిర్మించనుండగా, వీటికి కేంద్ర అటవీ శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పేరిట హైదరాబాద్ గ్రోత్ కారిడార్లో నిర్మిస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు కారణంగా రంగారెడ్డి జిల్లాలోని వందల ఎకరాల అటవీ భూములు ధ్వంసం కానున్నాయి.
– సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి జిల్లా రావిర్యాల వద్ద ఉన్న ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి (టాటా ఇంటర్ ఛేంజ్ వద్ద ప్రారంభమై కొంగరకలాన్, లేమూర్, గుమ్మడవల్లి, మీర్ఖాన్పేట్, కుర్మిద్ద, ముద్విన్ మీదుగా ఆమనగల్లు సమీపంలోని ట్రిపులార్ జంక్షన్) ఫ్యూచర్ సిటీ వరకు దాదాపు 42 కిలోమీటర్ల మేర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నది. దాదాపు 400 ఫీట్ల వెడల్పుతో ఆరు లేన్ల ఈ రోడ్డు కోసం హెచ్ఎండీఏ-హెచ్జీసీఎల్ ఏకంగా రూ.4,030 కోట్ల అంచనా బడ్జెట్గా నిర్ణయించారు. రెండు ఫేజ్లలో జరిగే ఈ నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే కాంట్రాక్టర్లకు పనులు కూడా కట్టబెట్టారు.
కడ్తాల్, మైసమ్మగూడ, నల్లవెల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న కీలకమైన రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకుల మీదుగా దాదాపు 300-400 ఫీట్ల వెడల్పు కలిగిన రోడ్డు వెళ్లనుంది. ఇంతటి అపారమైన అటవీ భూమిని రోడ్డు నిర్మాణం కోసం వినియోగించడంతో ఇక్కడ వృక్ష సంపద నిర్వీర్యం కానుంది. ఫారెస్టు రెండుగా చీలిపోవడంతో పాటు వన్యప్రాణుల సహజ ఆవాసం దెబ్బతినడంతోపాటు భారీగా పచ్చదనం నష్టపోవాల్సి వస్తున్నది. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసి, అభివృద్ధి పేరిట సాగుతున్న ఈ విధ్వంసంతో అటవీ క్షేత్రం కాస్తా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డుగా మారనుంది. ఒకవైపు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులో వస్తున్నా.. మరోవైపు కోల్పోతున్న వన సంపదతో ఆ ప్రాంత పర్యావరణ భవితను ప్రశ్నార్థకంగా మారుస్తున్నది. అయితే రోడ్డు నిర్మాణం కోసం ఫారెస్ట్ బ్లాకుల గుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నా.. సర్కార్ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.