న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా గర్భిణులు టీకాలు తీసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ సూచించారు. శుక్రవారం ఆయన కేంద్ర ఆరోగ్యమంత్రిత శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్తో కలిసి దేశంలో కొవిడ్ పరిస్థితిపై విలేకరులతో మాట్లాడారు. వ్యాక్సిన్లు సమర్థవంతంగా పని చేస్తున్నాయని, అందుబాటులో డేటా సైతం గర్భిణులకు టీకాలు వేయడం సురక్షితమని సూచిస్తున్నాయని తెలిపారు. వైరస్ సోకితే పిండంతో పాటు గర్భిణికి ప్రమాదం ఉంటుందన్నారు. గర్భస్రావం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. అందుకే టీకాలు వేయడం చాలా ముఖ్యమన్నారు. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.
కొవిడ్-19కు వ్యతిరేకంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్లో గర్భిణులను చేర్చనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నెల 2న ప్రకటించింది. దీనికి జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ) సిఫారసులను మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ప్రస్తుతం గర్భిణులు టీకా వేసుకునేందుకు కొవిడ్ వ్యాక్సినేసన్ కేంద్రాలు, కొవిన్ పోర్టల్ పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. గర్భిణులు వైరస్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని, ఫలితంగా ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో పాటు పిండంపై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
90 జిల్లాల నుంచే 80శాతం కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుతుందని లవ్ అగర్వాల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూ వంటి చర్యలతో వ్యాప్తి తగ్గిందని, ప్రస్తుం కేరళ, మహారాష్ట్రలో వ్యాప్తి పెరగుతుందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో మహమ్మారి వ్యాప్తికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రస్తుతం 90 జిల్లాల నుంచే 80శాతం కేసులు నమోదవుతున్నాయన్నారు.