ఢాకా : బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 52 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. భవనంలో ఇంకా మంటలు చెలరేగుతుండగా.. ఇప్పటికీ 52 మృతదేహాలను బయటకు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. రాజధాని ఢాకాకు తూర్పున 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూప్గంజ్లోని కర్మాగారంలో గురువారం సాయంత్రం మంటలు వ్యాపించగా.. ప్రమాదం జరిగి 24 గంటలు కావస్తున్నా ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రమాదంలో 30 మంది వరకు గాయపడగా.. వారంతా భవనం నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు కిందకు దూకారు. పలువురు కార్మికుల ఆచూకీ లేకపోవడంతో కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే, ఫ్యాక్టరీలో ఇంకా ఎంత మంది కార్మికులు చిక్కుకున్నారో స్పష్టంగా తెలియడం లేదని పోలీసులు తెలిపారు. మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఫైర్ సర్వీస్ ప్రతినిధి దేబాషిష్ బర్దన్ పేర్కొన్నారు. అయితే, మంటలు చెలరేగిన సమయంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారని మహ్మద్ సైఫుల్ అనే కార్మికుడు తెలిపాడు. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగడంతో తాను, మరో 13 మంది కార్మికులు కలిసి పైకప్పుపైకి పరుగెత్తామని, నల్లటి పొగ మొత్తం ఫ్యాక్టరీని కప్పేసిందని మరో కార్మికుడు మమూన్ చెప్పాడు. అగ్నిమాపక సిబ్బంది తమను రక్షించారని తెలిపాడు.