నడిగూడెం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలతో పల్లెలు పచ్చదనంగా మారుతున్నాయని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నారాయణపురం(కోడిపుంజులగూడెం) గ్రామంలో మెగా పల్లె ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. గ్రామాలలో పచ్చని చెట్లు పెంచి సుందర వనాలుగా తీర్చి దిద్దాలని కోరారు. స్వచ్ఛమైన తెలంగాణ కోసం ప్రభుత్వం స్పష్టమైన కార్యచరణతో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.
చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలన్నారు. చెత్తను గ్రామాల్లోని రోడ్లపై వేయకుం డా గ్రామపంచాయతీ ట్రాక్టర్ల ద్వారా ఊరి బయట వేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి వైకుంఠధామాన్ని నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. మొక్కలు పెంచి సంరక్షించాలని కోరారు. భావితరాలకు ఆస్తుల కన్నా కాలుష్య రహిత వాతావరణాన్ని ఇవ్వడమే నిజమైన ఆస్తి అని అన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తు న్న ప్రభు త్వానికి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు.
దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, జడ్పీటీసీ బాణాల కవితానాగరాజు, వైస్ ఎంపీపీ బడేటి వెంకటేశ్వర్లు, దేవబత్తిని సురేశ్, పాలడుగు ప్రసాద్, అనంతుల ఆంజనేయులు, పీఏసీఎస్ చైర్మన్ ఆకుల రామారావు, సర్పంచ్ నాగేందర్రెడ్డి, ఎంపీటీసీ మాలతి శ్రీనివాసరెడ్డి, దేవబత్తిని వెంకటనర్సయ్య, ఎంపీడీఓ ఇమామ్, తహసీల్దార్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.