అమరావతి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సొంత గ్రామం కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామానికి చేరుకున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా గ్రామానికి కుటుంబ సమేతంగా వచ్చిన సందర్భంగా గ్రామస్థులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. రైతు బిడ్డగా ఎన్వీరమణకు చిరకాలం గుర్తుండిపోయేలా గ్రామ శివారు నుంచి ఎండ్ల బండిపై ఊరేగించారు. దారిపొడవునా గ్రామస్థులు జస్టిస్కు పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికారు.
జస్టిస్ రాక సందర్భంగా గ్రామంలో తోరణాలు, ఫ్లెక్సీలను పెద్ద సంఖ్యలో కట్టారు. పొన్నవరంలో ఆయన కుటుంబానికి పొలాలు ఉన్నాయి. ఆయన పెదనాన్న కుమారుడు నూతలపాటి వీరనారాయణ కుటుంబం ఇక్కడే నివాసం ఉంటోంది. శుక్రవారం సోదరుడి నివాసంలోనే భోజనం ఏర్పాట్లు చేశారు.
గ్రామంలో దాదాపు నాలుగు గంటలసేపు ఆయన గడపనున్నారు. జస్టిస్ ఎన్వీరమణ పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.కార్యక్రమాల ఏర్పాట్లను సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, డీఐజీ మోహనరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పర్యవేక్షించారు.చివరగా రెండేళ్ల క్రితం సీజేఐ పొన్నవరం వచ్చారు.