హైదరాబాద్, నవంబర్ 12(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్లో హుజురాబాద్ ఓటమి కాక చల్లారడంలేదు. వరుస ఓటములపై పార్టీలో అసంతృప్తి భగ్గుమంటున్నది. ఇప్పటికే హుజురాబాద్ ఓటమిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని సీనియర్లు కడిగిపారేసిన విషయం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా బీజేపీతో జతకట్టి పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టారని మండిపడ్డారు. తాజాగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అసంతృప్తి గళాన్ని వినిపించారు. దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించాలంటూ అధిష్ఠానానికి లేఖ రాశారు. రాష్ట్రంలో పార్టీ ఏ దిశగా వెళ్తున్నదో అర్థంకావడం లేదని పేర్కొన్నారు. ఆదిలోనే సరిదిద్దకుంటే పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి వచ్చిన తర్వాత పార్టీలో పెద్దగా మార్పేమిలేదని ఆసంతృప్తి వ్యక్తంచేశారు. పరోక్షంగా ఆయన పనితీరుపై పోస్టుమార్టం కోరేందుకు ఓటములపై సమీక్ష కోరుతూ రాసిన లేఖపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది.
రైతుగోస పట్టని కాంగ్రెస్
రైతుల విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర రైతాంగాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు దగా చేస్తుంటే, కాంగ్రెస్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనేది లేదం టూ కేంద్రం తెగిసి చెప్తున్నా… కాంగ్రెస్ రైతులకు మద్దతుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రైతులకు అన్యాయం చేస్తున్న బీజేపీని పల్లెత్తు మాట కూడా అనకపోవడంతో, హుజురాబాద్ రహస్య పొత్తు ఇంకా కొనసాగుతుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు నష్టం చేస్తున్న బీజేపీని నిలయదీయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.