Polio vaccination | హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. మన రాష్ట్రంలో పోలియో చివరి కేసు 2007లో నమోదు అయింది. మన దేశంలో 2011లో చివరి కేసు నమోదు అయింది. గత 3 సంవత్సరాలుగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ తదితర దేశాల్లో పోలియో కేసులు నమోదు అవుతున్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది.
ఈ నేపథ్యంలో.. ఆయా దేశాల నుంచి రాకపోకలు జరుగుతున్న దేశంలోని పలు జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 290 జిల్లాలను ఎంపిక చేయగా, అందులో మన రాష్ట్రం నుంచి 5 జిల్లాలు (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ) ఉన్నాయి. ఈ ఐదు జిల్లాలతోపాటు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతంలోనూ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది.
ఈ 5 జిల్లాల పరిధిలో 0-5 సంవత్సరాల వయసు పిల్లలు 17,56,789 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. వీరందరికీ ఈ నెల 12న స్పెషల్ డ్రైవ్లో పోలియో వ్యాక్సిన్ వేయనున్నారు. అప్పుడే పుట్టిన శిశువుల దగ్గర్నుంచి, 5 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ వ్యాక్సిన్లు వేయించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.