మెదక్, డిసెంబర్ 27 : ప్రజల ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని, బాధితులకు న్యాయం చేయాలని, ఏ ఫిర్యాదులూ పెండింగ్ లేకుండా చూడాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రోహిణిప్రియదర్శిని ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరుగా మాట్లాడి వారి సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సివిల్ ఫిర్యాదులను కోర్టులోనే పరిష్కరించాల్సిందిగా వారికి సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రతి సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా, తూప్రాన్కు చెందిన ఎండీ రఫీయా బేగం ఫోన్ చేసి, కొంత కాలం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న తన భర్త యాకూబ్పై చర్యలు తీసుకొని, న్యాయం చేయాలని కోరింది. హవేళీఘనపూర్ మండలం చౌట్లపల్లి గ్రామానికి చెందిన గోకారం బుచ్చమ్మ ఫోన్ చేసి, గ్రామంలో తనకు ఉన్న 242 గజాల స్థలాన్ని గడ్డమీది నారాయణ, గడ్డమీది పోచయ్య, గడ్డమీది సాయిబాబా, గడ్డమీది లక్ష్మీ వీరందరూ తాను గ్రామంలో లేని సమయం చూసి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, తనపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని కోరింది.