ఆభరణాల చోరీ కేసులో ముగ్గురు అరెస్టు
ఖైరతాబాద్, జూన్ 8 : ఆధునిక టెక్నాలజీ నిందితులను పట్టించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నగల దుకాణంలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను సెల్ఫోన్ల ట్రాకింగ్ టెక్నాలజీతో పట్టుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ పీవీ గణేశ్, డీఐ నరసింహ వివరాలు వెల్లడించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ న్యూ షాపూర్నగర్కు చెందిన పున్నపు చెన్నకేశవరావు (43) బేగంపేట గ్రీన్ల్యాండ్స్లోని రవిరాజ్ నగల దుకాణంలో పదేండ్లుగా పనిచేస్తున్నాడు. గత మే 20న తన స్వగ్రామంలో వివాహమున్నదని యజమానికి చెప్పి వెళ్లాడు. ఇదిలా ఉండగా మే 31న రవిరాజ్ నగల దుకాణం పార్ట్నర్ రాజేంద్రకుమార్ శర్మకు సిద్ధి జూవెల్లరీస్ మేనేజర్ చంపక్ ఫోన్ చేసి చెన్నకేశవరావు తమ షాపులో మీ పేరు చెప్పి 451.510 గ్రాముల 38 బంగారు గాజులు, 311.670 గ్రాముల 17 నెక్లెస్లు తీసుకెళ్లాడని తెలిపాడు. దీంతో హతాశుడైన రాజేంద్రకుమార్ శర్మ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీఐ నిరంజన్ రెడ్డి, డీఐ నరసింహ, డీఎస్సైలు సీహెచ్ నరేశ్, ఎండీ రఫీయుద్దీన్తో కలిసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాకింగ్ చేశారు. దీంతో ప్రధాన నిందితుడు చెన్నకేశవరావు బంధువైన పున్నపు కిశోర్ కుమార్, హన్మకొండలోని టైలర్ స్ట్రీట్కు చెందిన నగల తయారీదారుడు బీమనాడి సతీశ్ చోరీలో పాలు పంచుకున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో తిరుగుతున్న నిందితులను సెల్ఫోన్ ట్రాకింగ్ ద్వారా పట్టుకున్నారు. బీమనాడి సతీశ్ దొంగతనానికి పాల్పడిన సొత్తును విక్రయించి పెట్టేందుకు ఒప్పందం చేసుకోగా, అతడి బంధువైన పున్నపు కిశోర్కుమార్ వారికి కొత్త సిమ్ కార్డులను సమకూర్చడంతో పాటు నగల చోరీలో సహకరించాడు. నిందితుల వద్ద నుంచి మొత్తం సొత్తును స్వాధీనం చేసుకున్నారు.