హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 19 లేదా 20న ప్రధాని హైదరాబాద్ పర్యటన ఖరారయ్యే అవకాశాలున్నట్టు తెలిసింది. వందేభారత్ రైలు ప్రారంభంతోపాటు రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రీమాడలింగ్ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినట్టు తెలిసింది. ఆరు నెలల తర్వాత నగరానికి వస్తున్న ప్రధాని మోదీ.. ఈ అధికారిక కార్యక్రమాలతోపాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని పార్టీవర్గాలు చెప్తున్నాయి. బీబీనగర్ ఎయిమ్స్ను కూడా ప్రధాని సందర్శిస్తారని సమాచారం.
వందేభారత్కు ఎట్టకేలకు మోక్షం!
వాస్తవానికి సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వందే భారత్ రైలు తొలి విడతలోనే ఉంటుందని ప్రచారం చేశారు. కానీ, నిరాశే ఎదురైంది. రెండో దశలోనైనా మంజూరవుతుందని ఆశించారు. కానీ అప్పుడూ తెలంగాణకు మొండిచేయి చూపారు. అది పశ్చిమ బెంగాల్కు పోయింది. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్కు త్వరలో మోక్షం కలుగనున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఈ నెల 19 లేదా 20వ తేదీన ప్రధాని పర్యటన సందర్భంగా సికింద్రాబాద్-విజయవాడకు వందేభారత్ రైలును ప్రారంభించనున్నట్టు తెలిసింది.