(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ముస్లింలే లక్ష్యంగా చొరబాటుదారులంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అవే తరహా వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లోని టోంక్లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే, వాళ్ల పాలనలో హనుమాన్ చాలీసాను వినడాన్ని కూడా నేరంగా పరిగణిస్తారని అన్నారు. మన విశ్వాసాలను ఆచరించడం కూడా కష్టమేనని ధ్వజమెత్తారు. దేశంలోని ప్రజల సంపదను దోచుకొని, లక్షిత వర్గాల వారికి దాన్ని పునఃపంపిణీ చేస్తుందని కాంగ్రెస్పై మరోసారి నిప్పులు చెరిగారు. ఈ విషయాన్ని చెప్తే.. కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు తనను నిందిస్తున్నారన్న మోదీ.. అయినప్పటికీ, ఈ నిజాన్ని తాను దేశ ప్రజలకు చెప్పదలుచుకొన్నట్టు వెల్లడించారు. ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ తెగబడుతున్నట్టు ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ కోటా తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, ఆంధ్రప్రదేశ్లో దీన్నో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అనంతరం దేశమంతటా అమలు చేయాలనుకొన్నదని ఆరోపించారు. దీనికోసం రాజ్యాంగ నియమాలను కూడా పట్టించుకోలేదన్నారు. చట్టపరమైన అవరోధాలు, సుప్రీంకోర్టు జోక్యంతో ఇది సాధ్యపడలేదని తెలిపారు.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ప్రధాని మోదీ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది హక్కుల కార్యకర్తలు, మేధావులు ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. కాగా, ఫిర్యాదులపై తాము పరిశీలిస్తున్నట్టు ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జాతీయ న్యూస్ వెబ్సైట్ ‘ఇండియా టుడే’ వెల్లడించింది.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, షరియా చట్టాన్ని తీసుకొస్తుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని ఆ పార్టీ స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశద్రోహానికి పాల్పడ్డాయన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.
రానున్న ఎన్నికలు ‘80 శాతం వర్సెస్ 20 శాతం’ ప్రజల మధ్య జరుగుతున్న పోరు అని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఎక్స్లో పోస్ట్ చేశారు. ముస్లింలే లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దేశ ప్రజల మధ్య విభజన రేఖను సృష్టించే కుట్రలకు బీజేపీ సిద్ధమయ్యిందని విరుచుకుపడ్డాయి.