ప్రభుత్వం బాధ్యత ఏమిటి?
లేనివాడికి ఆపన్నహస్తం అందించడమా?
పిడుక్కి, బియ్యానికి ఒకే మంత్రం వెయ్యడమా?
అసహాయులకు ఆసరా అందించడమా?
ముక్కుపిండి పన్నులు వసూలు చెయ్యడమా?
నిరుపేదలకు కొంత వెసులుబాటు కల్పించడమా?
సంపన్నుడితో సమానంగా భారం మోపడమా?
ఘనత వహించిన ప్రధాని మోదీ మాత్రం దేశంలోని పేదలకు ఏవీ ఉచితంగా ఇవ్వొద్దని ఉచిత సలహా ఇస్తున్నారు.
ఉచితాలపై ప్రధాని ఉక్రోషం తాయిలాలంటూ ఈసడింపు
తాయిలాలు పంచే పార్టీలు రోడ్లు, ఎయిర్ పోర్టులు కట్టలేరట
పెద్దలకు అన్నీ కట్టబెట్టాలి.. పేదలకు ఏమీ ఇవ్వొద్దనేది మోదీ ఉవాచ
న్యూఢిల్లీ, జూలై 16: పేదలకు ఉపశమనం కలిగించే దృష్టితో ప్రభుత్వాలు అమలు చేసే ఉచిత పథకాలపై ప్రధాని మోదీ కన్నెర్ర చేశారు. ఇదంతా తాయిలాల సంస్కృతి అంటూ మండిపడుతున్నారు. దేశాభివృద్ధికి ఇవి చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. 296 కిలోమీటర్ల బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభోత్సవ సభలో ఆయన పేదల సంక్షేమంపై నిప్పులు చెరిగారు. బెల్లం నువ్వులతో తయారు చేసే గుజరాతీ పిల్లల మిఠాయి రేవడీతో ఉచిత పథకాలను పోల్చారు. ముఖ్యంగా యువత ఈ తరహా పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రేవడి సంస్కృతి పాటించేవారు ఎక్స్ప్రెస్ వేస్, ఎయిర్ పోర్టులు డిఫెన్స్ కారిడార్లు నిర్మించలేరని నీతులు చెప్పుకొచ్చారు. ధరలు పెంచాలి.. ప్రజలకు బతుకు దుర్భరం చేయాలి.. ఎడాపెడా పన్నులు వెయ్యాలి.. ముక్కుపిండి వసూలు చెయ్యాలి. అంతేకానీ వారి సంక్షేమం కోసం ఉచిత పథకాలు ఏవీ అమలు చేయొద్దు. పెద్దలకు అన్నీ కట్టబెట్టాలి.. పేదలను మాత్రం పక్కన పెట్టాలి. ఉచితాలు అమలు చేస్తే రోడ్లు, విమానాశ్రయాలు కట్టలేమట. ఇదీ మోదీ మాట. అంటే అదానీ వంటి పెద్దలకు పనిలేకుండా పోతుందని తెగబాధపడిపోయారు. మరోవైపు గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోయి కడగండ్ల పాలు చేసిన పేదలకు మాత్రం ఎలాంటి ఉపశమనం ఉండొద్దని సెలవిస్తున్నారు.
ప్రధాని మోదీ ఉచిత పథకాలపై చేసిన విమర్శలపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దీటైన సమాధానమిచ్చారు. ఇంతకూ రేవడీ అనేది పార్లమెంటరీ సభ్యతకు భంగమైన పదమా? అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ముందు అధికార పార్టీవారు యువతకు ఉద్యోగాలు ఇచ్చి మాట్లాడాలని, అప్పుడు పరనిందల అవసరం వారికి రాదని పేర్కొన్నారు.
– ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
ఉచిత నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, ప్రాథమిక విద్య అందించడం తాయిలాల కిందకు రాదని, అది ప్రభుత్వ బాధ్యత అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాయిలాలు ఇవ్వొద్దంటూ ప్రధాని అన్న మాటలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘వేల కోట్లలో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని మీ స్నేహితులను క్షమించడాన్ని తాయిలం అంటారు. మీరు విదేశీ టూర్లకు వెళ్లడం, మీ దోస్తుల కోసం కాంట్రాక్టులు ఇప్పించడం తాయిలాలు ఇవ్వడం అంటారు’ అని చురకలంటించారు. ఉచిత విద్యుత్తుపై మాట్లాడే వారు ముందు మీ ఎంపీలకు ఎన్ని యూనిట్ల విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నారో తెలుసుకుని మాట్లాడాలంటూ మండిపడ్డారు.