హైదరాబాద్ : రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రామప్ప ఆలయాన్ని సందర్శించి, గొప్పదనం గురించి ప్రత్యక్ష అనుభవాన్ని పొందాలని కోరారు. కాకతీయ వారసత్వానికి ప్రతీక రామప్ప ఆలయం అని కొనియాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 42 కట్టడాలను ఈసారి గుర్తింపు ఇవ్వగా మన దేశం నుంచి రామప్ప ఆలయానికి మాత్రమే అవకాశం దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. పూర్వపు వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు. యునెస్కో గుర్తింపుతో ములుగు జిల్లాలో ఉన్న పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటికి చెందిన ఆలయం కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది.
Excellent! Congratulations to everyone, specially the people of Telangana.
— Narendra Modi (@narendramodi) July 25, 2021
The iconic Ramappa Temple showcases the outstanding craftsmanship of great Kakatiya dynasty. I would urge you all to visit this majestic Temple complex and get a first-hand experience of it’s grandness. https://t.co/muNhX49l9J pic.twitter.com/XMrAWJJao2