నమస్తే డాక్టర్. నా వయసు నలభై రెండు. ఏడు సంవత్సరాల బాబు ఉన్నాడు. నాకు థైరాయిడ్ ఇబ్బంది ఉంది. ఇటీవల నెలసరి అస్తవ్యస్తంగా వస్తున్నది. పదిహేను, ఇరవై రోజులకు ఒకసారి బహిష్టు అవుతున్నాను. ఒక్కోసారి నెలా, నెలా పదిహేను రోజుల తర్వాత కూడా వస్తున్నది. డాక్టరు దగ్గరికి వెళితే పీసీఓఎస్ అన్నారు. 21 రోజులకు మాత్రలు ఇచ్చారు. వాటిని ఆపేస్తే నెలసరి వస్తుంది. ఇలా ఎన్ని రోజులు వాడాలి. పీసీఓఎస్ మందులు జీవితాంతం వాడాలని కొందరు అంటున్నారు. బరువు తగ్గితే సరిపోతుందని మరి కొందరు చెబుతున్నారు. ఏది నిజం? ఏం చేస్తే నా సమస్య తీరుతుంది?
– ఓ సోదరి
పీసీఓఎస్.. పాలిసిస్టిక్ ఒవరీ సిండ్రోమ్ అనేది ఓ జీవనశైలి సమస్య. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డెలివరీ ఆలస్యంగా అయినట్టు తెలుస్తున్నది. అది కూడా సాధారణ గర్భమా, ఐవీఎఫ్ ద్వారానా అనేది తెలియదు. అలాగే థైరాయిడ్ కంట్రోల్లోనే ఉందా అన్నదీ చూసుకోవాలి. ఇక, మీ సమస్యకు డాక్టర్ ఇచ్చిన 21 రోజుల కోర్సు మంచిదే. అయితే మీ వయసు నలభై దాటింది కనుక, తక్కువ డోసేజీ మందులు వాడండి. ఎందుకంటే, డోసేజీ ఎక్కువైతే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లాంటి వ్యాధులు రావచ్చు. కాళ్లలో రక్తం గడ్డకట్టొచ్చు. ఒక వేళ ఈ రక్తం విడిపోయి గుండె లేదా మెదడుకు చేరితే ప్రమాదకరంగా మారుతుంది. రెండోది, నలభైలు దాటాక చాలా మందిలో ప్రీమెనోపాజల్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే ముట్లు ఆగిపోయే ముందు కనిపించే లక్షణాల్లో ఇదీ ఒకటి కావచ్చు. మీరన్నట్టు, పీసీఓఎస్ నుంచి విముక్తి పొందాలంటే బరువు తగ్గడమే ప్రధాన మార్గం. ఉన్న బరువులో కనీసం పదిశాతం తగ్గి, సమతులాహారం తీసుకుంటూ, క్రమబద్ధమైన వ్యాయామం చేస్తే ఇది సాధ్యమే. అప్పుడు, మందుల అవసరం లేకుండానే నెలసరి సక్రమంగా వచ్చే అవకాశం ఉంది. మీరు కనీసం ఆరు నెలలకోసారి డాక్టరును సంప్రదించాలి. మందులలో ఏమైనా మార్పులు చేర్పులు సూచిస్తే.. ఆ ప్రకారంగా వాడుతూ ఉండాలి.
(వైద్య నిపుణుల సలహా కోసం మహిళా పాఠకులు తమ సమస్యల్ని zindagi@ntnews.com కు మెయిల్ చేయవచ్చు)
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్