టోక్యో : 12-15 సంవత్సరాల మధ్య వయస్సున్న వారికి ఫైజర్ టీకాలు వేసేందుకు జపాన్ ప్రభుత్వం సోమవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వైద్య సిబ్బందికి, సీనియర్ సిటిజన్లకు టీకాలు వేస్తున్నందు 12-15 ఏజ్గ్రూప్ వారికి టీకాలు వేసే ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని స్థానిక మీడియా పేర్కొంది. ఇప్పటి వరకు జపనీస్ జనాభాలో ఆరుశాతం మంది సింగిల్ డోస్ తీసుకున్నారు. పలు అగ్రదేశాలతో పోలిస్తే తక్కువ. జూలైలో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమయ్యే ముందు జపాన్ ప్రధాని యోషిహిదే సుగా టీకాల పంపిణీని వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఫైజర్ వ్యాక్సిన్ను 2-8 డిగ్రీల వద్ద నెల రోజులు నిల్వ చేయవచ్చు. 2,260 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. వంద శాతం సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
ఈ నెల ప్రారంభంలో అమెరికా, యూరోపియన్ యూనియన్తో పాటు కెనడా ప్రభుత్వం సైతం 12-15 ఏళ్ల వయస్సుగల పిల్లలకు అత్యవసర వినియోగం కింద టీకాలు వేసేందుకు అనుమతి ఇచ్చాయి. గత ఫిబ్రవరిలో 16 అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికి జపాన్ ఫైజర్ వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇచ్చింది. 97 మిలియన్ల డోసులు సరఫరా చేసేందుకు కంపెనీ ఒప్పందం చేసుకుంది. అదే సమయంలో బ్రిటిష్ ఔషధ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా, యూఎస్ బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నాతో సైతం టీకాల సరఫరాకు ఒప్పందం చేసుకుంది.