నిర్మల్ అర్బన్, మార్చి 24 : రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ధరల నియంత్రణలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ధ్వజమెత్తారు. పెరిగిన సిలిండర్, డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసనగా గురువారం నిర్మల్ పట్టణంలో మహిళలతో కలిసి ఖాళీ సిలిండర్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఒకేసారి వంటగ్యాస్పై రూ.50, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ధరలను వెంటనే తగ్గించాలని, లేకుంటే మహిళాలోకం పెద్దఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. నిర్మల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, పట్టణ మహిళా అధ్యక్షురాలు అంగ సోని, కౌన్సిలర్లు కొండ సబిత, తులసి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణ గౌడ్, మహిళలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.