హైదరాబాద్ : రాష్ట్రంలో వరుస పండుగల దృష్ట్యా ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు సూచించారు. డెల్టా వేరియంట్ వ్యాప్తిని ప్రభుత్వ సహకారంతో వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కోఠిలోని తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి (రెండో వేవ్) మరో రెండు నెలల వరకు కొనసాగుతుందని భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని తక్కువ కాలంలో కట్టడి చేయగలిగాం. కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మోడల్గా నిలిచిందని శ్రీనివాస రావు అన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, అలాంటి చోట్ల వైరస్ కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కేసులు తక్కువగా ఉన్నప్పుడే వైరస్ వ్యాప్తిని సులువుగా నియంత్రించగలమని అభిప్రాయపడ్డారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు.