నిజామాబాద్ : అభివృద్ధి పనులు చేసే వారి కాళ్లల్లో కట్టెలు పెట్టే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అరవై ఏండ్లలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ఏడు సంవత్సరాల్లోనే జరిగిందన్నారు.
జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో గల బాల్కొండ, కమ్మర్పల్లి మండలాల్లో సుమారు 8 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేశారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు ఇలా అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందన్నారు.
కేంద్రంతో సమానంగా గ్రామాలకు నిధులిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అని తెలిపారు. దేశ వ్యాప్తంగా 10 ఉత్తమ గ్రామాలు ఎన్నికైతే అందులో 7 గ్రామాలు తెలంగాణ నుంచే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ మే చెప్తుందని గుర్తు చేశారు.
బీజేపీ,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ అభివృద్ధి ఎందుకు లేదో ఆ పార్టీ కార్యకర్తలు ఆలోచన చేయాలని సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరుగుతుందని దీనిపై చర్చకు సిద్ధమన్నారు.
ఎనిమిది ఏండ్ల కింద జరిగిన తెలంగాణ ఏర్పాటు మీద పార్లమెంట్ లో అవమానకరంగా మాట్లాడుతున్న
ప్రధాని మోదీ చేత ఇక్కడి బిజెపి నాయకులు కిషన్ రెడ్డి,సంజయ్,అర్వింద్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేసారు.బీజేపీ నాయకులు రెచ్చగొట్టే మాటలకు మోసపోతే మళ్లీ పూర్వపు రోజుల్లాగే గోసపడుతామని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.