రంగారెడ్డి జిల్లా కోర్టు, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ న్యాయవాదులు, న్యాయమూర్తులను కోరారు. రంగారెడ్డి జిల్లాలో లక్ష 77వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని పూర్తి చేయడానికి ఇటీవల నూతన న్యాయమూర్తులను నియమించామని, కొత్త కోర్టులు ఏర్పాటయ్యాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తోటపల్లి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్రశర్మ, రంగారెడ్డి జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, జస్టిస్ సుమలత, జస్టిస్ శ్రీసుధా, జస్టిస్ తుకారాంజి, జస్టిస్ లక్ష్మణ్, రంగారెడ్డి జిల్లా సీనియర్ న్యాయవాదులు పుల్లా రెడ్డి, జనార్దన్ రెడ్డి, జీవన్ రెడ్డిలతో పాటు పూర్వ అధ్యక్షులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాములుగౌడ్, సహాయ కార్యదర్శి రంగా ప్రవీణ్, క్రీడా కార్యదర్శి రమేశ్, మహిళా కార్యదర్శి వనజ, కోశాధికారి రమణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
141చలాన్లు.. రూ.33,265 జరిమానాలు
అబిడ్స్, నవంబర్ 19 : బాటా జంక్షన్ నుంచి ఎంజే మార్కెట్కు వెళ్లే దారిలో అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఫీరోజ్ అలీ జివాణి అనే వ్యక్తి ద్విచక్రవాహనాన్ని (ఏపీ13 ఏబీ1474) తనిఖీ చేయగా 141చలాన్లు, రూ.33,265 జరిమానా ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాహనాన్ని సీజ్ చేయగా, అప్పటికప్పుడు 38 చలాన్లకు సంబంధించిన డబ్బులు చెల్లించాడు. ఇంకా 103 చలాన్లు పెండింగ్లో ఉన్నాయని సీఐ జి.సుధాకర్ తెలిపారు.