పెద్దపల్లి : ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఎన్టీపీసీలోని మిలీనియం హాలులో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అధ్యక్షతన పెద్దపల్లి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా రెండో దశవ్యాప్తి నేపథ్యంలో రైతులకు అండగా ఉన్నామన్నారు. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 57,494 మంది రైతుల నుంచి రూ.678.08 కోట్ల విలువైన 3.89 లక్షల మెట్రిక్ టన్నుల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. మిషన్ భగీరథపై చర్చ సందర్భంగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ మేరకు అవసరమైన పనులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో అటవీ భూములు, రెవెన్యూ భూములకు, అటవీ భూములు, ప్రైవేటు భూముల మధ్య ఉన్న వివాదాలపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం అందించే నివేదిక ఆధారంగా జాయింట్ సర్వేను చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతి పెండింగ్ పనులను త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకోవాలని, పల్లెలను హరితగ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. రామగుండం ప్రాంతంలో అధికంగా పరిశ్రమలు ఉన్నాయని, వాటితో కాలుష్యం అధికమవుతున్నందున పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
రామగుండం ప్రాంతంలో ఉన్న గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచే విధంగా ప్రణాళిక తయారు చేయాలని, వచ్చే ఏడాది మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఆరు శ్మశాన వాటిక నిర్మాణ పనులకు ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించి పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇండ్లపై నుంచి వెళ్లే హై టెన్షన్ వైర్లు తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హరితహారం, పల్లె ప్రగతి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు స్థానిక కమిటీలను భాగస్వామ్యం చేయాలని మంత్రి సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే ఆదర్శగ్రామాలను తీర్చిదిద్దవచ్చన్నారు.
దళితుల కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దళిత సాధికారత పథకాన్ని ప్రారంభించారని, వచ్చే సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెంచే విద్ధంగా బడ్జెట్లో కేటాయింపులు చేసుకుందామని సీఎం తెలిపారన్నారు. ఈ మేరకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ సభ తీర్మానం చేసింది. సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, గ్రంథాలయ చైర్మన్ రఘువీర్సింగ్, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.