శ్రీనగర్ : సైన్యం, పోలీసు బలంతో కశ్మీర్లో శాంతి నెలకొనదని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇందు కోసం రాజకీయ పార్టీలతో మాట్లాడి పరిస్థితి నుంచి బయటపడాలన్నారు. ప్రజల హృదయాలను లుచుకోవాలన్నారు. కశ్మీర్ లోయలో మైనారిటీ సిబ్బందితో పాటు అమర్నాథ్ యాత్రకు సరైన భద్రత కల్పించాలని కేంద్రానికి సూచించారు. యాత్రలో ఎలాంటి సంఘటనా జమ్మూ కశ్మీర్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు. ప్రస్తుతం కశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. గత మంగళవారం ఉపాధ్యాయురాలు రజనీ బాలా, గురువారం బ్యాంకు మేనేజర్ను ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన స్పందించారు. లోయలో శాంతిభద్రతల్లో ఇది సంక్షోభ పరిస్థితి అనీ, దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని రాజకీయ పార్టీలను పిలిచి.. ఓ మార్గాన్ని కనుగొనాలన్నారు. ఇది ప్రభావంతంగా ఉంటుందని, ప్రజల హృదయాలను గెలుచుకోవడం ద్వారా మార్పు సాధ్యమవుతుందన్నారు. ప్రతి కుటుంబానికి ముందు భద్రత కావాలన్నారు. అయితే, ఖీర్ భవానీ యాత్రను రద్దు చేయాలా? అని ప్రశ్నించగా.. భద్రతా పరమైన అంశాలే అతిపెద్దవని, ప్రతి కుటుంబం ముందు భద్రతను కోరుకుంటుందని, ఇప్పుడు పరిస్థితిల్లో భద్రత లేదన్నారు. జమ్మూ నుంచి కశ్మీర్ లోయలోని గ్రామాల్లో పాఠాలు చెప్పేందుకు వెళ్లిన వారికి భద్రత ఎక్కడా కనిపించడం లేదన్నారు.