పెండింగ్ చలాన్లు : 3,82,255
చెల్లించాల్సింది
20,04,01,720
పూర్తయిన చలాన్లు : 47,350
చెల్లించింది రూ.: 2.61 కోట్లు
పెండింగ్ చలాన్లు : 4,65,335
చెల్లించాల్సింది :
30,51,04,195
పూర్తయిన చలాన్లు : 49,170
చెల్లించింది రూ. : 3.80 కోట్లు
రోడ్డు భద్రత నియమాలు పాటించని వాహనాలకు విధించిన జరిమానాలపై ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో వాహనదారులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 8,33,590 చలాన్లకుగానూ రూ. 50.51 కోట్ల బకాయి ఉండగా 18 రోజుల్లో 96,520 చలాన్లపై రూ.6.40 కోట్లు కట్టారు. ఈ రాయితీపై పోలీస్ శాఖ విస్తృతంగా ప్రచారం చేయడంతో నెట్ బ్యాకింగ్, మీసేవ, ఈ సేవ, యూసీఐడీల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకే అవకాశం ఉండడంతో మరింత వేగంగా చెల్లింపులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సూర్యాపేట, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ప్రజలు వేగంగా స్పందిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు ప్రభుత్వం చలాన్ల చెల్లింపులో రాయితీ ఇవ్వడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ద్విచక్రవాహనదారులకు 75శాతం, కార్లకు 50 శాతం, మాస్కులకు 90శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటిం చింది. దీనికిగాను
https://echallan.tspolice.gov.in ప్రత్యేక లింక్ను అందుబాటులోకి తెచ్చారు. వాహనాల యజమానులు తమ జరిమానాలు చెల్లిస్తున్నారు. ట్రాఫిక్ వెబ్సైట్లో వాహనం నంబర్, ఇంజన్ నంబర్ లేదా దాని చాసిస్ చివరి నాలుగు అంకెలు నమోదు చేస్తే జరిమానా రాయితీ మొత్తం వస్తుంది. నెట్ బ్యాకింగ్, యూపీఐడీల ద్వారా వెంటనే చెల్లిస్తున్నారు. రాయితీ చెల్లింపులు ప్రారంభమైన మార్చి 1, 2 తేదీల్లో పెద్దగా స్పందన రాకపోగా 3,4 తేదీల నుంచి రెండు జిల్లాల్లో వాహనదారులు 96,520 కేసులకు సంబంధించి 6.40 కోట్లు చెల్లించారు.
పెండింగ్ చలాన్ల బకాయిలు చెల్లింపునకు రాయితీ ఇస్తామని పది రోజులుగా ట్రాఫిక్ పోలీసులు విస్తృత ప్రచారం చేశారు. అయితే ముందుగా జంటనగరాలకే పరిమితం అనుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్నట్లు సామజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కావడంతో వెబ్సైట్కు వాహనాదారుల తాకిడి పెరిగింది. ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి వరకు బకాయిలు చెల్లింపునకు అవకాశం ఉన్నది. ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్తోపాటు ఈసేవ, మీసపేవ, ట్రాఫిక్ స్టేషన్ల వద్ద కూడా చలాన్లు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 8,33,590 పెండింగ్ చలాన్ల రూపంలో సుమారు రూ.50.51 కోట్ల బకాయిలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో 2019 నుంచి ఇప్పటివరకు 6,63,742 చలాన్ల రూపంలో, 43,62,04,309 రూపాయలను జరిమానలను విధించారు. అందులో 1,98,407 చలాన్లు 13,11,00,110 రూపాయలను చెల్లించారు. ఇంకా 4,65,335 చాలన్లు పెండింగ్లో ఉండగా వాటి ద్వారా 30,51,04,195 రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో నల్లగొండ జిల్లాలో 49,170 మంది 3.80 కోట్ల రూపాయలు చెల్లించారు. సూర్యాపేట జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు 3,68,255 పెండింగ్ చలాన్లు ఉండగా రూ. 20.51కోట్లు బకాయిలున్నాయి. అయితే రెండు రోజుల్లో ఇప్పటివరకు 47,350 పెండింగ్ చలానాల చెల్లింపులు చేయగా 2.31 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. రెండు జిల్లాలో కలిపి ఇప్పటివరకు 6.40 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమయ్యాయి. ఇంకా 7,45,590 పెండింగ్ చలానాలతో కలిపి 45.50 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి.
పెండింగ్ ఈ చలాన్లకు కల్పించిన రాయితీ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా జరిమానా పడకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి. ఇప్పటివరకు తమ వాహ నాలకు ఆన్లైన్ చలాన్ల ద్వారా పడిన జరిమానాలకు ప్రభుత్వం ప్రకటించిన భారీ రాయితీ మార్చితో ముగియనుంది. మళ్లీ గడువు పెంచే అవకాశం ఉండదు. – రాజేంద్రప్రసాద్, సూర్యాపేట ఎస్పీ
తెలంగాణ ప్రభుత్వం వాహనదారులపై వేసిన చలాన్లు తగ్గిండం అభినందనీయం. నా వాహనానికి గతంలో ఉన్న రూ. 1600 చలానాకు గాను ప్రభుత్వం ఇచ్చిన రాయితీతో కేవలం 810 రూపాయలు మాత్రమే ఆన్లైన్లో కనిపిస్తున్నది. కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చలానాలో రాయితీ కల్పించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
– మందడి సైదులు, సూర్యాపేట