పాట్నా : బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. కొద్ది గంటల్లోనే 145 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పెద్ద ఎత్తున రోడ్లు నీట ముగగా.. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున నీరు ఇండ్లలోకి ప్రవేశించింది. బిహార్ ఉప ముఖ్యమంత్రి రేణుదేవి నివాస సముదాయం వద్ద ఒకటిన్నర అడుగుల మేర నీరు నిలిచింది. ప్రస్తుత సీజన్లో వర్షాలు భారీగా పడడం సాధారణమేనని వాతావరణ కేంద్ర శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాల ప్రభావం భారీగా ఉందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. వాతావరణ శాఖ శనివారం ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.