హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ అదేవిధంగా ఖమ్మం-నల్లగొండ- వరంగల్ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీదేవిలకే తమ మద్దతునిస్తున్నట్లు తెలంగాణ పారామెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోషియేషన్, వొకేషనల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోషియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావును కలిసి ఈ మేరకు అసోషియేషన్ కమిటీలు తీర్మానం చేసిన మద్దతు లేఖను అన్ని జిల్లాల కమిటీ నేతలతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం పారామెడికల్ కళాశాల, వొకేషనల్ కళాశాలల సమస్యలను పరిష్కరించినందుకు గుర్తుపెట్టుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్ధతు తెలపడం అభినందనీయమన్నారు. మీ ఓట్లతో పాటు ఓటు హక్కు ఉన్న విద్యార్థులు, బంధువులతోను టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయించాలని మంత్రి కోరారు. ఓటింగ్ శాతం పెరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పారామెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోషియేషన్ గౌరవ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, అధ్యక్షులు ఎం. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ధారా సింగ్, చీఫ్ అడ్వైజర్ విజయ రవీందర్, ఉపాధ్యక్షులు జహంగీర్ పాషా, జాయింట్ సెక్రటరీలు డెవిడ్, సోమ మల్లన్న, తదితరులు పాల్గొన్నారు.