ఇస్లామాబాద్: అంతా ఒక దారిలో పోతే.. తాను మరో దారిలో వెళ్తా అంటున్నది పాకిస్థాన్. బీజింగ్లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ (Winter Olympics) ఆరంభ వేడుకలకు తాను హాజరవుతున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. దీనికోసం తాను గురువారం చైనాకు వెళ్తున్నట్లు చెప్పారు. అయితే చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో వింటర్ ఒలింపిక్స్ వేడుకలను చాలా దేశాలు ఇప్పటికే బహిష్కరించాయి. తాము కానీ, తమ రాయబారులు కానీ ఆరంభ వేడుకల్లో పాల్గొనేది లేదని ఆయా దేశాల ప్రభుత్వాధినేతలు ప్రకటించారు.
తాను ఫిబ్రవరి 3 నుంచి 6వ తేదీవరకు చైనాలో పర్యటిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో పాల్గొంటానని, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ప్రధాని లి కెక్వియాంగ్తో సమావేశమవుతానని వెల్లడించారు. ఇరు దేశాల వాణిజ్యపరమైన, రక్షణ, తదితర అంశాలను చర్చించనున్నట్లు చెప్పారు.
వింటర్ ఒలింపిక్స్కు బీజింగ్ ఆతిథ్యం ఇస్తున్నది. ఫిబ్రవరి 4న ఆరంభ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్నది. ఇందులో ఆ దేశ అధ్యక్షుడితోపాటు ప్రభుత్వ పెద్దలు పాల్గొననున్నారు. వీరితోపాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఐక్యారజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ సహా వివిధ దేశాలకు చెందిన 32 మంది నాయకులు పాల్గొంటారని ప్రభుత్వం వెల్లడించింది.
కాగా, చైనాలో భారీగా అణచివేతలు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతుండటంతో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇటలీ సహా పలు దేశాలు బీజింగ్ ఒలింపిక్స్ ఆరంభ వేడులకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి.