Turkey Earthquake | ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియా దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పేకమేడల్లా కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం భూకంప మృతుల సంఖ్య 23వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఒక్క తుర్కియేలోనే 20,318 మంది మృతి చెందగా.. సిరియాలో 3,513 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో కలిపి మొత్తం 23,831 మంది మృత్యువాతపడ్డారు. ఇక భూకంపం ధాటికి 80 వేల మందికిపైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు వెల్లడించారు.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం 1,10,000 మంది రెస్యూ సిబ్బంది పని చేస్తున్నారని, 5,500 వాహనాలు, క్రేన్లు, బుల్డోజర్లతో శిథిలాలు తొలగిస్తున్నట్టు తుర్కియే అధికారులు చెప్తున్నారు. అయితే, తమ వారిని కాపాడుకునేందుకు ప్రజలు కూడా బృందాలుగా ఏర్పడి శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారు తమని కాపాడాలని చేస్తున్న ఆక్రందనలు విని భరించలేకపోతున్న ప్రజలు వారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
భూకంపం ధాటికి కకావికలమైన తుర్కియే, సిరియాల్లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. అయిన వాళ్లను కోల్పోయిన వారి ఆక్రందనలతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. కొన్ని దృశ్యాలైతే హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. కొందైరే పుట్టుకతోనే కుటుంబాన్ని కోల్పోతున్నారు.