ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా పరిస్థితుల్లోనూ అభివృద్ధి, సంక్షేమం పరుగులు నల్లగొండ జడ్పీ సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చైర్మన్ నరేందర్రెడ్డి అధ్యక్షతన మన ఊరు-మన బడిపై సుదీర్ఘ చర్చ స్వాగతించిన ప్రజాప్రతినిధులు.. పలు శాఖల్లో నెలకొన్న సమస్యలు సభ దృష్టికి..
తక్షణ పరిష్కారానికి ఆదేశాలిచ్చిన మంత్రి, కలెక్టర్, జడ్పీ చైర్మన్‘తెలంగాణ పల్లెలు అభివృద్ధిలో పట్టణాలతో సరిసమానంగా పోటీపడుతున్నాయి. యావత్ భారతదేశంలోనే మన పల్లెలు నంబర్ వన్ స్థాయికి చేరుకున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఇది నిదర్శనం’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఫ్లోరైడ్తో తల్లడిల్లుతూ అన్ని రంగాల్లో వెనుకబడ్డ నల్లగొండ జిల్లా స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్ చొరవ వల్ల నేడు సస్యశ్యామలంగా మారిందని గుర్తుచేశారు. నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం పదిన్నరకు సమావేశం ప్రారంభం కాగా, దాదాపు రెండున్నర గంటల పాటు మన ఊరు- మన బడి విధివిధానాలు, నిధులు, సమస్యల గుర్తింపు, మొదటి విడుతలో అభివృద్ధి చేయనున్న పాఠశాలలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం వివిధ శాఖల పని తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతోపాటు స్థ్దానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పార్టీలకతీతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జిల్లాను నడిపిస్తుండడం అభినందనీయమన్నారు. కరోనా కష్టకాలంలో అనేక రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకుని బడ్జెట్లో కోతలు విధిస్తే.. తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నిర్విరామంగా కొనసాగించారని కొనియాడారు.
నల్లగొండ, మార్చి 4 : ఫ్లోరోసిస్ సమస్యతో తల్లడిల్లుతూ అన్ని రంగాల్లో వెనుకబడ్డ నల్లగొండ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో నేడు సస్యశ్యామలంగా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన సభ రెండున్న గంటలపాటు మన ఊరు-మన బడిపై సుదీర్ఘంగా విధి విధానాలు, నిధుల లభ్యత, సమస్యల గుర్తింపు, మొదటి విడుతలో అభివృద్ధి చేసే పాఠశాలల వివరాలపై చర్చించి ఆ తర్వాత మిగిలిన శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సర్కార్ చొరవతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయమై పార్టీలకతీతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జిల్లాను నడిపించడం అభినందనీయమన్నారు. కరోనా సమయంలో ఆశ వర్కర్ల నుంచి డీఎంహెచ్ఓ వరకు యుద్ధప్రాతిపదికన పని చేయడంతోనే మహమ్మారి నుంచి కోలుకున్నట్లు తెలిపారు. కొవిడ్ కారణంగా ఎన్నో రాష్ట్రాలు తమ బడ్జెట్లో కోతలు విధించుకుంటే సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు మాత్రం ఆగిపోకుండా కొనసాగాయన్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులతో ఆ రంగంలో మూడు, నాలుగింతల ఆదాయం పెరుగడంతో ఆర్థిక వ్యవస్థ కూడా గణనీయంగా పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో అనేక పాలసీలు తీసుకొచ్చి రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అంతకు ముందు సమావేశంలో సభ్యులు ఆయా శాఖల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా కలెక్టర్, జడ్పీ చైర్మన్ పరిష్కార మార్గాలు చూపించగా, ఇక్కడ పరిష్కారం కాని సమస్యలను తాము పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే నోముల భగత్ను జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డితోపాటు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సన్మానించారు. ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాలల్లో స్కావెంజర్లు లేకపోవడంతో పారిశుధ్య సమస్య నెలకొన్నదని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో మిషన్ భగీరథ నీటి సౌకర్యం కల్పించనందున వెంటనే సమస్యను పరిష్కరించాలని తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డితోపాటు ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. మునుగోడు ప్రభుత్వ పాఠశాలకు నిధులు సరిపోకపోవడంతో భవనం అసంపూర్తిగా ఉన్నదని, మరో రూ.10లక్షలు ఇవ్వాలని జడ్పీటీసీ స్వరూపారాణి కోరారు. దేవరకొండ, మునుగోడు, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని మారు ప్రాంతాల పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు లేక పిల్లలు నష్టపోతున్నారని, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలతోనే ఈ సమస్య వస్తున్నందున అక్కడికి బదిలీ అయిన వారికి డిప్యుటేషన్ ఇవ్వవద్దని ఆయా మండలాల వారు కోరారు. ఈ మూడు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైపులు పగిలితే మరమ్మతులు చేయకపోవడంతో ప్రస్తుతం కృష్ణా నీరు రావడం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని చైర్మన్తోపాటు కలెక్టర్ అధికారులకు సూచించారు.
మన ఊరు -మన బడి పథకాన్ని స్వాగతిస్తున్నాం. గత 40 ఏండ్లలో ఏ ప్రభుత్వం గ్రామీణ పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేయలేదు. ఇప్పుడు పాఠశాలల్లో 12 రకాల సమస్యల పరిష్కారం కోసం సమృద్ధిగా నిధులు ఇవ్వడం శుభపరిణామం. అయితే ఈ పథకంలో ఎంపీపీలు, జడ్పీటీసీలకు సైతం అధికారికంగా భాగస్వామ్యం కల్పిస్తే వారికి కూడా బాధ్యత పెరుగుతుంది. గతంలో మోడల్ స్కూళ్ల కోసం మరిన్ని నిధులు కేటాయించిన ప్రభుత్వం, ఈ పథకానికీ అంతే స్థాయిలో నిధులు కేటాయించడం సంతోషకరం. పాఠశాలల్లో స్కావెంజర్లు లేకపోతే పారిశుధ్య సమస్యలు నెలకొనే అవకాశం ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో జీపీ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులతో శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలి.
-అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్సీ
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విడుతల వారీగా దళిత బంధు కార్యక్రమం అమలు చేయనున్న నేపథ్యంలో ఎస్సీ కార్పొరేషన్ యంత్రాంగం ఏ గ్రామంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నయో గుర్తించాలి. కొన్ని ప్రాంతాల్లో పైపులు పగిలి పోవడంతో మిషన్ భగీరథ నీరు అందడం లేదు. వాటికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మరమ్మతులు చేయించాలి. గురుకులాల్లో డ్రాపౌట్స్ ఉంటే స్థానికులకే అవకాశం కల్పించాలి. మన ఊరు- మన బడిలో కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని విద్యాశాఖ అంచనాలు రూపొందించాలి. కొండమల్లేపల్లి పాఠశాల బైఫర్కేషన్కు సంబంధించి పీఏపల్లి హైస్కూల్ నూతన భవనానికి ప్రభుత్వానికి నివేదించండి.
– రవీంద్ర కుమార్, ఎమ్మెల్యే, దేవరకొండ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలుచేస్తుంది. విద్యా శాఖ యంత్రాంగం ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయకుండా చర్యలు తీసుకోవాలి. సమస్యల గుర్తింపునకు నియమించిన కమిటీ పాఠశాలలో నెలకొన్న ప్రతి సమస్యనూ గుర్తించి నివేదించాలి. ఇక పాఠశాలల్లో స్కావెంజర్లు లేకుంటే పారిశుధ్య సమస్య నెలకొనే అవకాశం ఉన్నందున తాత్కాలికంగా జీపీలు సర్దుబాటు చేయాలి.
-ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ
మన ఊరు-మన బడి అనేది ప్రభుత్వం చేపట్టిన గొప్ప పథకం. తొలి విడుతగా జిల్లాలో 517 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నందున ఆ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలి. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ తాగునీటి వసతితోపాటు విద్యుత్ సౌకర్యం లేదు. వాటిని గుర్తించి నీటి వసతి కల్పించటంతోపాటు బిల్లులు కట్టకపోవడంతో కొన్ని పాఠశాలల్లో కరెంట్ కట్ చేశారు. అదేవిధంగా మారు ప్రాంతాల్లోని పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు లేక పోవడంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉన్నందున వాటిని గుర్తించి సర్దుబాటు చేయాలి.
-నల్లమోతు భాస్కర్రావు, ఎమ్మెల్యే, మిర్యాలగూడ
మన బడి పథకం కింద ప్రభుత్వం అన్ని పాఠశాలలను మూడు విడుతల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. జిల్లాలో 1,483 పాఠశాలల్లో 1.07 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. మొదటి విడుతలో ఎక్కువ విద్యార్థులున్న 517 పాఠశాలలను ఎంపిక చేశాం. 12 రకాల సమస్యల్లో ఏది లేకున్నా దాన్ని ఈ పథకంలో చేర్చి అబివృద్ధి చేస్తాం. ఎస్ఎంసీ చైర్మన్, సర్పంచ్, పీఆర్ఏఈ, ప్రధానోపాధ్యాయుడు కమిటీగా ఉంటారు. వీళ్లు పాఠశాలల్లో సమస్యలు గుర్తించి ఎంపీపీ, జడ్పీటీసీలతో చర్చించి నివేదిక ఇవ్వాలి. దళిత బంధు విషయంలో ఆహార భద్రతా కార్డు ఉన్న వారికే స్కీం వర్తిస్తుంది. వేసవి నేపథ్యంలో ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.
పల్లెల్లో పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమం చేపట్టింది. జిల్లాలో తొలి విడుతలో ఎంపిక చేసిన 517 పాఠశాలల్లో సమస్యలు గుర్తించి పూర్తి స్థాయిలో అభివృద్ధి ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆయా పాఠశాలల్లో పర్యటించి స్థానిక కమిటీతో సమన్వయం చేసుకొని సమస్యలను గుర్తించాలి. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. గురుకులాల్లో డ్రాపౌట్స్ ఉంటే స్థానిక ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన విద్యార్థులకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
కరోనా సమయంలో ప్రాథమిక ఆస్పత్రుల్లో ఉన్న సిబ్బందిని ప్రాంతీయ ఆస్పత్రులకు, అర్బన్ ఆస్పత్రులకు డిప్యుటేషన్ చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేనందున తిరిగి స్టాఫ్ను సర్దుబాటు చేయండి. తిరుమలగిరి పీహెచ్సీలో స్టాఫ్ లేదు. అదేవిధంగా కమలానెహ్రూ ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి నెలకొన్నది. వాటిల్లో రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోండి.
– నోముల భగత్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే
జడ్పీ సమావేశం అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు. మునుగోడు మండల కేంద్రం, చండూరు మండలంలోని బంగారిగడ్డ, గట్టుప్పల్లో 297 మందికి కల్యాణాలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా గట్టుప్పల్వాసులకు మంత్రితీపి కబురు వినిపించారు. గట్టుప్పల్ను మండల కేంద్రం చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమని, త్వరలోనే ఇది అమలు జరుగుతుందని ప్రకటించారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఉన్నారు.