సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ):డార్క్ నెట్లో డ్రగ్స్ ఆర్డర్ ఇస్తూ హైదరాబాద్లో విద్యార్థులకు సరఫరా చేస్తున్న ముఠాను ఆసిఫ్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ గురువారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హయత్నగర్కు చెందిన దరావత్ సాయిచరణ్ బీటెక్ పూర్తి చేశాడు. సంవత్సర కాలంగా డార్క్ నెట్లో మిథైలెనెడియోక్సి మెథాంఫేటమిన్(ఎండీఎంఏ) పిల్స్ను డార్క్ నెట్లో ఆర్డర్ ఇస్తున్నాడు.
వాటిని ఎంబీఏ చేసిన అమీర్పేట్కు చెందిన రాచర్ల అంకిత్, బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న బీహెచ్ఈఎల్కు చెందిన బెల్లి అజయ్ సాయిల ద్వారా నగరంలో సరఫరా చేయిస్తున్నాడు. దీంతో పాటు కొన్ని మొబైల్ యాప్లను కూడా డ్రగ్స్ కొనడానికి, కస్టమర్లకు అందజేయడానికి ఉపయోగిస్తున్నాడు. ఈ యాప్ల ద్వారా అన్లైన్ పేమెంట్స్ అడ్వాన్స్గా పొంది ఎండీఎంఏ పిల్స్ను అవసరాన్ని బట్టి తెప్పిస్తూ యువతకు సరఫరా చేస్తున్నాడు. సమాచారం అందుకున్న ఆసిఫ్నగర్ పోలీసులు ఈ ముఠాపై నిఘా పెట్టారు. గురువారం మెహిదీపట్నం బస్టాప్లో బెల్లి అజయ్సాయి, అంకిత్లు డ్రగ్స్ విక్రయించే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం రావడంతో ఆసిఫ్నగర్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద ఎండీఎంఏ పిల్స్(మందు గోళిల మాదిరి) 50 లభ్యమయ్యాయి.
విచారణలో ప్రధాన సూత్రదారి సాయిచరణ్ గురించి చెప్పడంతో అతన్ని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా మరో 60 పిల్స్ లభించాయని సీపీ వివరించారు. వీటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందన్నారు. అయితే డార్క్ నెట్, యాప్ల ద్వారా డ్రగ్స్ను ఆర్డర్ ఇవ్వడంతో గోవా నుంచి కొరియర్ ద్వారా హైదరాబాద్కు చేరుతున్నాయని నిందితులు వివరించారు. ఈ మేరకు నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఆసిఫ్నగర్ పోలీసులను సీపీ అభినందించారు. ఈ సమావేశంలో వెస్ట్జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.