విపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్న మోదీ ప్రభుత్వం మరో విస్మయకర నిర్ణయం తీసుకున్నది. లోక్సభలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ముఖ్య నేత రాహుల్గాంధీపై అనర్హత వేటు పడేలా చేసింది. 2019 ఎన్నికల సందర్భంగా మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేండ్ల జైలుశిక్ష విధించిన మరునాడే లోక్సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసింది. అప్పీలుకు దిగువ కోర్టు అవకాశమిచ్చినా.. మోదీ ప్రభుత్వం అందుకు సమయం ఇవ్వకుండా రాహుల్ను పార్లమెంటు నుంచి బయటకు పంపేసింది. దీని ప్రకారం.. రెండేండ్ల శిక్ష తర్వాత కూడా ఆరేండ్లపాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏండ్లలో.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో.. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న తరుణంలో.. వెలువడిన ఈ అనూహ్య నిర్ణయంతో దేశం నివ్వెరపోయింది.
దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇది కాంగ్రెస్ లేదా రాహుల్ గాంధీ పోరాటం మాత్రమే కాదు.. అరకొర చదువుతో నియంతృత్వ పాలన సాగిస్తున్న వ్యక్తిపై మొత్తం ప్రతిపక్షం చేస్తున్న పోరాటం. బ్రిటిష్ పాలకుల కంటే బీజేపీ ప్రభుత్వమే ప్రమాదకరం.
– కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్
ఈ ఫాసిస్ట్ నిర్ణయాన్ని ఖండిస్తున్నా. ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులపై బీజేపీ దాడి చేస్తున్నది. స్వేచ్ఛగా మాట్లాడేందుకు జాతీయ పార్టీల నేతలు, ఎంపీలకు కూడా ప్రజాస్వామిక హక్కు లేదని బెదిరిస్తున్నట్టుగా ఈ పరిణామం ఉన్నది.
– ఎంకే స్టాలిన్, తమిళనాడు సీఎం
ఆధునిక భారతదేశంలో ప్రతిపక్ష నేతలు బీజేపీకి ప్రధాన లక్ష్యంగా మారారు. నేర చరితులను క్యాబినెట్లోకి చేర్చుకొంటారు. ప్రతిపక్ష నేతలను వారు చేసిన ప్రసంగాల కారణంగా అనర్హులుగా ప్రకటిస్తున్నారు. దేశ ప్రజాస్వామ్యం మరింత పతనమవడాన్ని చూస్తున్నాం.
– మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి
విమర్శించేవారిపై కేంద్రం చూపుతున్న ఈ అసహనం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ప్రజాస్వామ్యంపై సంఘ్ పరివార్ చేసిన హింసాత్మక దాడి ఇది. అసమ్మతిని, వ్యతిరేకతను బలవంతంగా అణచివేసే ఫాసిస్ట్ పద్ధతి.
– విజయన్, కేరళ సీఎం
దేశ ఆర్థిక వ్యవస్థను ముంచుతున్న ‘పారిశ్రామిక మిత్రుడి’ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడనే రాహుల్పై అనర్హత వేటు. నేతలు చేసిన వ్యాఖ్యలు, వాడిన భాషపై పారదర్శకంగా విచారణ జరిపితే బీజేపీ సభ్యులెందరో శాసనసభ సభ్యత్వం కోల్పోతారు.
– అఖిలేశ్ యాదవ్, ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం
ఎమర్జెన్సీని మించిపోయి..
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ఠ. రాజ్యాంగబద్ధ సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యల కోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతున్నది. నేరస్థులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు.
– సీఎం కేసీఆర్
తలొగ్గేది లేదు
మోదీజీ.. మీ భజనపరులు వీరమరణం పొందిన మాజీ ప్రధాని కుమారుడిని దేశద్రోహి, మీర్ జాఫర్ అంటూ పిలిచారు. రాహుల్ తండ్రి ఎవరు? అంటూ మీ పార్టీకి చెందిన సీఎం ఒకరు వ్యాఖ్యానించారు. రాహుల్, ఆయన కుటుంబంపై పలుమార్లు అవమానకరంగా మాట్లాడారు. మేము నెహ్రూను ఇంటి పేరుగా ఎందుకు పెట్టుకోవడం లేదని మీరు(మోదీ) ఇటీవల పార్లమెంట్లో అడిగారు. అయినా ఏ జడ్జీ కూడా మీకు రెండేండ్ల శిక్ష విధించ లేదు. మేం తలొగ్గం.
– ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
నిరంకుశ చర్యలను ప్రతిఘటించాలి
రాహుల్పై అనర్హత వేటును ఖండిస్తున్నా. ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకొనేందుకు అధికార బీజేపీ ఈ పరువు నష్టం రూట్ను ఎంచుకొన్నది. రాహుల్ని చేసినట్టుగానే ఇతర ప్రతిపక్ష నేతలను కూడా ఇదేవిధంగా చేయాలని కుట్రలు చేస్తున్నది. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఇప్పటికే సీబీఐ, ఈడీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్న తరుణంలో.. తాజా పరిణామం ఆందోళనకరం. – సీతారాం ఏచూరి, సీపీఎం ప్రధాన కార్యదర్శి
నియంతకు నిత్యం భయం
ప్రజలు ఒకరోజున తనకు భయపడటం మానేస్తారని ఒక నియంత నిరంతరంగా చాలా భయపడుతుంటాడు. భయపడొద్దని దేశం మొత్తానికి చెప్పే వ్యక్తిని మీరు భయపెట్టాలని అనుకొంటున్నారు. ఇంధిరాగాంధీ విషయంలో ఇదే విధంగా చేశారు. తర్వాత ఏం జరిగిందో చరిత్రలో చూశాం.
– భూపేశ్ బఘేల్. ఛత్తీస్గఢ్ సీఎం
నియంతృత్వానికి మరో ఉదాహరణ
రాహుల్పై అనర్హత వేటు నియంతృత్వానికి మరో ఉదాహరణ. బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఆడుతున్న ఈ ఆట ప్రజాస్వామ్యానికి ముప్పు. నియంతృత్వంపై పోరాటానికి రాహుల్ మరింత బలంగా ముందుకు వస్తారు.
– అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ సీఎం
ప్రజాస్వామ్యం ఖూనీ
ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దేశాన్ని దోచుకొని పారిపోతున్న దొంగను దొంగ అని పిలువడం కూడా నేడు నేరమైపోయింది. అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒత్తిడితో పనిచేస్తున్నాయి. ఈ పోరాటానికి ఇప్పుడు ఒక దిశ అవసరం.
– ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) అధినేత
దేశంలో అత్యవసర పరిస్థితి
అధికార బీజేపీ ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొంటున్నది. రాజకీయ విభేదాలు ప్రతీకార యుద్ధాలుగా మారాయి. ఇది దేశంలో ఒకవిధంగా అత్యవసర పరిస్థితి లాంటిది. దేశంలో బీజేపీ నేతలకు మాత్రమే వారు చెప్పే అమృతకాలం ఉన్నది. ప్రతిపక్షాలతో పాటు దేశ పౌరులకు మాత్రం ఆపత్కాల్(ఎమర్జెన్సీ) నడుస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన చేతిలో ఉన్న ప్రతి అస్ర్తాన్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతలను బలవంతంగా అణచేసే పని పెట్టుకొన్నది.
– హేమంత్ సొరేన్, జార్ఖండ్ సీఎం