హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): టీ-హబ్, సాస్భూమి ఆధ్వర్యంలో ఐటీ నిపుణులు, డెవ్రెవ్ సీఈవో ధీరజ్ పాండేతో ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీ-హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఉదయం 9.30-11:30 గంటల మధ్య గచ్చిబౌలిలోని టీ-హబ్లో ఈ కార్యక్రమం ఉంటుంది. ధీరజ్ పాండేతో నేరుగా ఔత్సాహిక స్టార్టప్ నిర్వాహకులు సమావేశమై తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వివరాలకు, పేర్ల నమోదు కోసం ఈ లింక్లో https://bit.ly/ 3sl766vలో సంప్రదించాలని కోరారు.
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీ రంగంలో వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన టెక్నాలజీ, ఉత్పత్తుల గురించి ఔత్సాహికులకు తెలియజేసేందుకు టీ-హబ్ వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆవిష్కరణలు, అభివృద్ధి రంగాల్లో విద్యా సంస్థలను భాగస్వాములను చేసేందుకు టీ ట్రైబ్ పేరుతో టీ-హబ్లో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాలపై అధ్యయనం, వాటి తయారీకి అవసరమైన పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు, సొంతంగా వ్యాపార సంస్థలను స్థాపించేందుకు వీలున్న ఔత్సాహికులకు శిక్షణనిచ్చేలా ఈవీ ఎంటర్ప్రెన్యూరియల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని టీ-హబ్ ప్రతినిధులు తెలిపారు. ఇండస్ట్రీ పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు ఒక కోర్సుగా దీన్ని పరిగణించి శిక్షణనిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు https://bit.ly/352Cq0U లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.