ఆదాయం పన్ను దాఖలు చేసేందుకు మరో ఆరు పనిదినాల సమయమే మిగిలిఉన్నది. ఈ తక్కువ సమయంలోనూ ట్యాక్స్ను సేవింగ్ చేసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు.
కొన్ని టిప్స్ పాటించడం ద్వారా చివరి నిమిషంలో కూడా కొంతలో కొంత సేవింగ్ చేసుకునే వీలుంటుందని వారు సలహా ఇస్తున్నారు.
ఇప్పుడు మీరు టాక్స్ నెట్ పరిధిలోకి వచ్చి పన్ను ఆదా చేయడానికి అవసరమైన పెట్టుబడులు పెట్టకపోతే ఇప్పుడే అందుకు అడుగేయండి. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మీరు పన్ను ఆదా చేయడమే కాకుండా డబ్బు నుంచి డబ్బు సంపాదించగలుగుతారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పన్నును ఆదా చేయడానికి, ఆ పెట్టుబడి నుంచి డబ్బు సంపాదించడానికి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం (ఈఎల్ఎస్ఎస్), నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) సహా మరికొన్ని ఇతర పథకాలలో పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. వీటిలో ఈఎల్ఎస్ఎస్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అంటే మ్యూచువల్ ఫండ్ స్కీం. మ్యూచువల్ ఫండ్ యొక్క ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
మార్కెట్లో ఉన్న ఈఎల్ఎస్ఎస్లో లాక్-ఇన్-పీరియడ్ 3 సంవత్సరాలు. అంటే మీరు 3 సంవత్సరాలు ఆ పథకం నుంచి డబ్బు తీసుకోలేరు. చాలా ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులు గత ఒక సంవత్సరంలో 80 శాతానికి పైగా రాబడిని ఇచ్చాయి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం సెక్షన్ 80 సీసీడీ (1), సబ్ సెక్షన్ 80 సీసీడీ కింద నేషనల్ పెన్షన్ పథకంలో డిపాజిట్లపై పన్ను మినహాయింపు ఉంటుంది. జీతం తీసుకునే ఉద్యోగి తన జీతంలో 10 శాతం వరకు, జీతం లేని ఉద్యోగి తన మొత్తం ఆదాయంలో 20 శాతం వరకు పెన్షన్ ఖాతాలో జమ చేసుకునే వీలున్నది. ఇది గరిష్టంగా రూ.1.5 లక్షలు. ఇది కాకుండా మరొక సబ్-సెక్షన్ 80 సీసీడీ (1బీ) కూడా ఉన్నది.
దీని కింద జీతం తీసుకునే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు వారి తరపున ఎన్పీఎస్ ఖాతాలో జమ చేయడం ద్వారా అదనపు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ తగ్గింపు రూ.50,000 వరకు ఉంటుంది.
ఎన్పీఎస్ వినియోగదారులు ఈక్విటీ నుండి సంవత్సరంలో సుమారు 12.5–17 శాతం రాబడిని పొందారు. ప్రిఫరెన్షియల్ వాటా 12–14 శాతం లాభాలను ఇవ్వగా, ఎన్పీఎస్ కస్టమర్లు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి ద్వారా 10–15 శాతం రాబడిని పొందారు.
పోస్టాఫీసు యొక్క చిన్న పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టిన తరువాత కూడా అధిక వడ్డీతో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద ఆదాయపు పన్ను ప్రయోజనాన్ని పొందుతారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో పెట్టుబడి ద్వారా రూ.1.5 లక్షల వరకు పన్నును ఆదా చేసుకునే వీలున్నది.
అలాగే మరో 6 పోస్టాఫీసు పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో మంచి రాబడితో పాటు ఆదాయపు పన్ను తగ్గింపు ప్రయోజనం లభిస్తుంది.
5 సంవత్సరాల ఎఫ్డీని టాక్స్ సేవింగ్ ఎఫ్డీ అంటారు. ఇందులో పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇదే కాకుండా, పన్ను మినహాయింపు కోసం పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ (టైమ్ డిపాజిట్ స్కీం) లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
జీవిత బీమాతో మంచి రాబడిని పొందగల పెట్టుబడి ఎంపిక కోసం చూస్తున్నట్లయితే.. యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్) లో పెట్టుబడి పెట్టవచ్చు. యులిప్లు జీవిత బీమా పాలసీ, మార్కెట్ లింక్ పెట్టుబడి ఉత్పత్తి యొక్క కలయిక. దీని కింద ప్రీమియంలో కొంత భాగం ఈక్విటీ లేదా డెట్ ఫండ్లలో పెట్టుబడిగా పెడతారు. ఇది పాలసీదారు జీవించినప్పుడు, చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబానికి ఆర్థిక భద్రత ఇస్తుంది.
ఇది యూఎఫ్ఓ కాదు.. రష్యా కార్గో ఎయిర్షిప్..!
ఆర్టిస్ట్ లండన్లో.. మహిళ నెదర్లాండ్స్లో.. 5 జీ టెక్నాలజీ టాటూ
భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల ఉరితీత.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.