హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ ) : సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియంపై అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. వచ్చే నెలలో నిర్వహించే ‘బడిబాట’లో భాగంగా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ను ఉన్నతాధికారుల ఆమోదానికి పంపించారు. జూన్ 1 నుంచి 12 వరకు రాష్ట్రంలో బడిబాట నిర్వహిస్తారు.
జూన్ 13న బడులు తెరుచుకోనున్నాయి. సెలవురోజులు మినహాయిస్తే 6 నుంచి 7 రోజులు బడిబాట నిర్వహించవచ్చని అధికారులు తేల్చారు. ఇప్పటికే 10వేల పాఠశాలల్లో తెలుగుకు సమాంతరంగా ఇంగ్లిష్ మీడియాన్ని బోధిస్తున్నారు. మరో 16వేల స్కూళ్లల్లో కొత్తగా ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు.
చివరిసారిగా 2019లో బడిబాట నిర్వహించగా, కరోనాతో 2020, 2021 విద్యాసంవత్సరాల్లో బడిబాట నిర్వహించలేదు. రెండేండ్ల విరామం తర్వాత ఈ విద్యాసంవత్సరం బడిబాట నిర్వహణకు ఇటీవల మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈసారి బడిబాటలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల ప్రారంభం, ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని చేర్చారు.