న్యూఢిల్లీ, మార్చి 26: ఐరోపాలోని పలు దేశాలతో పాటు దక్షిణకొరియా, అమెరికా, చైనా తదితర దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతున్నది. కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ప్రభావం కారణంగానే తిరిగి కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో భారత్లో త్వరలో నాలుగో వేవ్ సంభవిస్తుందనే ఆందోళన రేగుతున్నది. ప్రస్తుతానికి మన దేశంలో కరోనా అదుపులో ఉన్నప్పటికీ.. మిగతా దేశాల్లో భారీయెత్తున కేసుల పెరుగుదల ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఈ నేపథ్యంలో జూన్ మధ్యలో భారత్లో నాలుగో దశ సంభవించే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దక్షిణ కొరియాలో రోజుకు దాదాపు 3.5 లక్షల కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. జర్మనీలో ఈ సంఖ్య 3 లక్షలు, ఫ్రాన్స్లో 1.5 లక్షలుగా ఉన్నది. వియత్నాం, ఇటలీలో దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. ఇక ఆస్ట్రేలియా, జపాన్లో రోజుకు 50 వేలకు పైగా, యూకేలో దాదాపుగా 50 వేలు, అమెరికాలో 35 వేల కేసులు రికార్డవుతున్నాయి. చైనాలో కూడా గత కొన్ని రోజులుగా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఆ దేశం తిరిగి ఆంక్షలు, లాక్డౌన్ బాట పట్టింది.