న్యూఢిల్లీ : ఓలా దాదాపు 500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు సన్నాహాలు చేపట్టింది. సాఫ్ట్వేర్ టీములకు చెందిన ఉద్యోగులపై ఓలా వేటు వేయవచ్చని భావిస్తున్నారు. కంపెనీ పునర్వ్యవస్ధీకరణ ప్రక్రియలో భాగంగా తాజా లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఓలా యాప్పై వర్క్ చేస్తున్న టెకీలను తప్పించేందుకు కంపెనీ కసరత్తు సాగిస్తున్నదనే వార్తలొచ్చాయి.
ఇటీవల లాంఛ్ చేసిన ఓలా ఎస్1 ప్రొ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్స్ పడిపోతున్న క్రమంలో ఈ కధనాలు వస్తుండటం గమనార్హం. మరోవైపు తాజా లేఆఫ్లపై కంపెనీ నిర్ధిష్టంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఎంతమంది ఉద్యోగులపై వేటు వేస్తుందనే వివరాలను ఓలా బహిర్గతం చేయలేదు. ఓలా ఎలక్ట్రిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగేతర విభాగాలపై దృష్టి సారించిందని, ఇంజనీరింగ్, ఆర్అండ్డీ, వాహన, సెల్, బ్యాటరీ, మ్యాన్చుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్ విభాగాలపై ఫోకస్ పెడుతోందని ఓలా ప్రతినిధి చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కంపెనీలో 2000 మంది ఇంజనీర్లుండగా రాబోయే 18 నెలల్లో వీరి సంఖ్యను 5000కు పెంచుతామని అన్నారు. ఈ క్రమంలో పునర్వ్యవస్ధీకరణపై కంపెనీ దృష్టిసారించిందని చెప్పారు. ఇక ఓలా ఇటీవల తన ప్రీ ఓన్డ్ కార్ వ్యాపారానికి చెందిన 2000 మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు నెట్ఫ్లిక్స్, మెక్రోసాఫ్ట్ వంటి పలు టెక్ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను తొలగించగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సైతం ఉత్పాదకత పెంచుకోని సిబ్బందిపై వేటు తప్పదని లేఆఫ్స్పై ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది.