Ola-Uber | ఈనాడు ఓలా.. ఉబెర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమైన పేర్లు. క్యాబ్ అగ్రిగేటర్ సర్వీసులుగా భారత్లో పరస్పరం పోటీ పడ్డ రెండు క్యాబ్ సర్వీసుల సంస్థలు విలీనం కాబోతున్నాయని వార్తలొచ్చాయి. ఈ విషయమై ఓలా సహా వ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్.. ఇటీవల అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోనూ ఉబెర్ టాప్ ఎగ్జిక్యూటివ్లతో భేటీ అయ్యారని సమాచారం. రెండు సంస్థల విలీనంపై చర్చించారని వార్తలొచ్చాయి. నాలుగేండ్ల క్రితం కూడా విలీనం కోసం ఓలా, ఉబెర్ మధ్య చర్చలు జరిగాయి. నాడు రెండు సంస్థల్లో కామన్ ఇన్వెస్టర్గా జపాన్కు చెందిన సాఫ్ట్ బ్యాంక్.. వాటి విలీన ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. కానీ ఓలా, ఉబెర్ మధ్య నాడు జరిగిన విలీన చర్చలు ఫలప్రదం కాలేదు. కానీ, ఇటీవలి కాలంలో విలీనంపై ఉబెర్, ఓలా చర్చలను పునరుద్ధరించాయని సమాచారం.
భారత క్యాబ్స్ మార్కెట్లో పట్టు కోసం రెండు సంస్థలూ తీవ్రంగా పోటీ పడ్డాయి. మార్కెట్ పెంచుకోవడానికి డ్రైవర్లకు బిలియన్ల కొద్ది డాలర్లు, ప్యాసింజర్లకు డిస్కౌంట్లు ఇచ్చాయి. కానీ, కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రెండు సంస్థలు నిబంధనలు కఠినతరం చేశాయి. ఫలితంగా భారత్లో యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసులకు గిరాకీ పడిపోయింది.
ఓలా తన క్విక్ డెలివరీ అండ్ యూజ్డ్ కార్ బిజినెస్లను ఇప్పటికే మూసేసింది. కొద్దిమంది టీమ్తో కోర్ మొబిలిటీపైన ఫోకస్ చేయాలని ఓలా నిర్ణయానికి వచ్చింది. దీనికి తోడు ఖర్చులు తగ్గించుకోవడానికి 500 మంది ఉద్యోగులను సాగనంపాలని తొలుత ఓలా యాజమాన్యం వేసుకున్న అంచనాలు చివరకు వెయ్యిమందిని ఇండ్లకు పంపేసింది. ఇదిలా ఉంటే, నెల రోజుల క్రితం తమ సంస్థ విక్రయ ప్రతిపాదనను గట్టిగా తిరస్కరించింది. ఏడాది క్రితం ఉబెర్.. భారత్లోని తన యూనిట్ను విక్రయించనున్నదన్న వార్తలు బ్లూమ్బర్గ్లో వచ్చాయి.
తాజాగా శాన్ఫ్రాన్సిస్కోలో ఉబెర్ ప్రధాన కార్యాలయాన్ని భవిష్ అగర్వాల్ సందర్శించడం.. రెండు సంస్థల ప్రతినిధుల మధ్య చర్చలపై ఉబెర్ అధికార ప్రతినిధులెవరూ స్పందించలేదు. ఓలా కూడా తమ రెండు సంస్థల విలీనంపై వచ్చిన వార్తలను ధృవీకరించడానికి ముందుకు రాలేదు. ఒక సంస్థలో విలీనానికి బదులు ఇతర సంస్థలను టేకోవర్ చేయడానికి ప్రయత్నిస్తామని ఓలా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే క్యాబ్ సర్వీసుల్లో అత్యంత లాభాలు గడిస్తున్న సంస్థల్లో ఒకటిగా ఓలా నిలిచింది. కనుక ఇతర సంస్థలతో విలీనమయ్యే ప్రసక్తే లేదని ఆ సంస్థ వర్గాలు చెబుతున్నాయి.