మెదక్ : మహాశివరాత్రి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఏడుపాయల జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు సమష్టిగా పనిచేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు. ఈనెల 18 నుంచి జరిగే జాతర ఏర్పాట్లపై కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలోనే మూడు రోజుల పాటు నిర్వహించే అతి పెద్ద ఏడుపాయల జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 2 కోట్లను మంజూరు చేశారని అన్నారు. హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ తదితర జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి 8 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశముందన్నారు. రహదారుల పై జాతరకు సంబంధించి హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. లైటింగ్, పార్కింగ్, సీ సీ కెమెరాలు ఏర్పాటు చేసి పొలిసు కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలన్నారు.
మహిళా భక్తులు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు స్నానమాచరించేందుకు విరివిగా షవర్లు, మంచినీటి సదుపాయాలు కల్పించాలన్నారు. నీటి ప్రవాహం, స్నానమాచరించే ప్రాంతాలు, బ్రిడ్జిల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అంబులెన్స్ లు, అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేయాలని, శానిటేషన్, బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్ వంటివి చేయాలన్నారు.
బస్టాండు నుంచి దేవస్థానం వరకు ఉచితంగా మినీ బస్సులు, పోలీసు ఆధ్వర్యంలో 10 ఆటోలు నడపాలని సూచించారు. ఈ సందర్భంగా జాతర పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని జాతర ఏర్పాట్ల గురించి అధికారులు దిశా నిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఆలయ ఈవో శ్రీనివాస్, ఆర్డీవో సాయి రామ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.