లక్నో : అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో ఐదెకరాల స్ధలంలో నిర్మిస్తున్న మసీదు (Mosque in Ayodhya) తాజ్ మహల్ కంటే మెరుగ్గా ఉంటుందని బీజేపీ నేత, మసీద్ మహ్మద్ బిన్ అబ్ధుల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ హజి అర్ఫత్ షేక్ పేర్కొన్నారు. రామ మందిరానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న ఈ మసీదు ప్రత్యేకతలు, వసతుల గురించి ఆయన వివరించారు. కాగా, అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్ధలంలో రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతిస్తూ పట్టణంలోని ప్రముఖ ప్రాంతంలో నూతన మసీదు నిర్మాణానికి సన్నీ వక్ఫ్బోర్డుకు ఐదెకరాల స్ధలం కేటాయించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది.
ఆపై అయోధ్యలోని ధన్నిపూర్ గ్రామంలో ఐదెకరాల స్ధలాన్ని మసీదు నిర్మాణం కోసం యూపీ ప్రభుత్వం కేటాయించింది. భారత్లోనే అతిపెద్ద మసీదుగా చెబుతున్న ఈ ప్రాంగణంలో 21 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఖురాన్ ఉంటుందని హజీ అర్ఫత్ షేక్ తెలిపారు. ఈ మసీదు తాజ్మహల్ కంటే అద్భుతంగా ఉంటుందనే విశ్వాసం తమకుందని చెప్పారు.
ఈ మసీదులో కేవలం నమాజ్ చేసేందుకే కాకుండా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు 500 పడకల క్యాన్సర్ ఆస్పత్రి ఉందని తెలిపారు. క్యాన్సర్ చికిత్స కోసం యూపీ నుంచి ఏ ఒక్కరూ ముంబై వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. మసీదు ప్రాంగణంలో పలు దంత, వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ఈ మసీదులో అన్ని మతాలు, కులాల ప్రజలు భోజనం చేసే వెసులుబాటు ఉందని, ఇక్కడ 5000 మంది ఒకేసారి భోజనం చేయవచ్చని వెల్లడించారు.
Read More :