హైదరాబాద్ మార్చి 11 (నమస్తే తెలంగాణ): గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని పోషకాహార లోపం అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో వచ్చే నెల నుంచి అమలుచేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కిట్స్ను కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, ములుగు జిల్లాలోని గర్భిణులకు అందజేస్తామని వివరించారు. 2017 జూన్ 2 నుంచి ఇప్పటివరకు రూ.1,387.19 కోట్లతో 13. 29 లక్షల కేసీఆర్ కిట్స్ను పంపిణీ చేసినట్టు తెలిపారు. కేసీఆర్ కిట్స్తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. మాతా శిశు సంరక్షణలో గణనీయమైన పురోగతి సాధించామని, రాష్ట్రంలో రూ.407 కోట్లతో 26 మాతాశిశు కేంద్రాలను నెలకొల్పినట్టు పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలకు వచ్చే తల్లుల మరణాలు, నవజాత శిశువుల మరణాలు, సిజేరియన్లు గణనీయంగా తగ్గాయని గణాంకాలతో వివరించారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో వచ్చిన అంటురోగాల్లో సిజేరియన్ ఒకటని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ దవాఖానలను నిర్వీర్యం చేసి, ప్రైవేట్ను ప్రోత్సహించడమే ఈ దుస్థితికి కారణమని చెప్పారు. ప్రైవేట్ దవాఖానల్లో 78 శాతం సిజేరియన్లు చేస్తున్నారని వివరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 20 శాతం మాత్రమే సిజేరియన్లు చేస్తున్నట్టు తెలిపారు. సాధారణ ప్రసవాలను 75 శాతానికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. సిజేరియన్ల తగ్గింపు, మాతా శిశు సంరక్షణ కోసం ఎమ్మెల్యేలు సమీక్షలు నిర్వహించాలని సూచించారు. కేసీఆర్ కిట్ పథకం డబ్బులు జమ చేసేందుకు బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనపై బ్యాంక్ అధికారులకు ఆదేశాలిస్తామని చెప్పారు.
స్వరాష్ట్రంలో మాతాశిశు సంరక్షణలో సాధించిన ప్రగతి
అంశం 2014 ప్రస్తుతం
ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు 30% 54%
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలకు
వచ్చే తల్లుల మరణాలు (లక్షకు) 92 63
నవజాత శిశువుల మరణాలు (లక్షకు) 39 23