మంచిర్యాల, మే 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు పౌష్టికాహారం అందించి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో రాష్ట్ర సర్కారు న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్ కిట్టు ఇస్తూ పుట్టిన బిడ్డకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. తాజాగా న్యూట్రిషన్ కిట్టు ఇస్తూ తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాలను ఎంపిక చేయగా.. ఇందులో పైలెట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఉన్నాయి. సత్ఫలితాలు ఇవ్వడంతో మంచిర్యాల జిల్లాను ఎంపిక చేసింది. మొదటగా మంచిర్యాల జిల్లాలో 1,104 మంది గర్భిణులకు కిట్లు ఇచ్చేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాకు 401 బాక్స్ల కిట్లు రాగా.. వాటిని ఎంసీహెచ్ ప్రత్యేక గదిలో భద్రపరిచారు. త్వరలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ ప్రక్రియ మొదలుకానుంది.
మాతా శిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యలనిస్తూ.. గడిచిన ఎనిమిదేళ్లలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కేసీఆర్ కిట్టు పథకాన్ని తీసుకొచ్చి పుట్టిన బిడ్డకు అవసరమైన వస్తువులు అందించిన సర్కార్.. తాజాగా కడుపులో ఉన్న బిడ్డతోపాటు గర్భిణుల్లో రక్తహీనత ఉండొద్దు, తల్లీబిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలనే సుదుద్దేశంతో ‘న్యూట్రిషన్ కిట్’ పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో అత్యధిక రక్తహీనత ఉన్న తొమ్మిది జిల్లాలో తొలి విడుతలో న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయగా సత్ఫలితాయి వచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడుత కింద ఎంపిక చేసిన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 5,487 మందికి, ఆదిలాబాద్ జిల్లాలో 6,040 మందికి కిట్లను పంపిణీ చేశారు. ప్రస్తుత విడుతలో నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లు ఇవ్వనుండగా, మంచిర్యాల జిల్లాలో 1,104 మంది గర్భిణులకు కిట్లు ఇచ్చేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రక్తహీనత నుంచి విముక్తి..
గర్భిణులు ఆరోగ్యంగా ఉంటేనే కడుపులో పిండం ఆరోగ్యంగా ఎ దుగుతుంది. కానీ రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన చాలా మంది గర్భిణులు పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నారు. ప్రసవ సమయంలో అవస్థలు పడుతున్నారు. బిడ్డ పోషకాహార లో పంతో జన్మించడం లేదా పుట్టిన వెంటనే మరణించడానికి దారితీస్తున్నది. ఇలాంటి దుస్థితి పూర్తిగా తొలిగిపోవాలని, ప్రసవ సమయంలో ఆడబిడ్డ ఇబ్బందులు పడొద్దని న్యూట్రిషన్ కిట్ల పంపిణీని మొదలుపెట్టింది. ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాకు 401 కిట్లు వచ్చాయి. వాటిని ఎంసీహెచ్ ప్రత్యేక గదిలో భద్రపరిచారు. మంచిర్యాల జిల్లాలో 1,100 మంది గర్భిణులకు ఈ కిట్లు ఇ వ్వనున్నారు. అలాగే 14-24 వారాల గర్భిణులకు పీహెచ్సీలలో, 27 వారాల నుంచి 34 వారాల గర్భిణులకు ఎంసీహెచ్లలో కిట్లు అందిస్తారు.
కిట్లలో ఏముంటాయంటే..
ఈ కిట్లలో బలానికి రెండు హార్లిక్స్, రక్తం ఎదగడానికి కేజీ లైన్డేట్స్, డైజేషన్ కోసం ఆఫ్ కేజీ నెయ్యి, రక్తహీనత రాకుండా మూడు ఐరన్ సిరప్లు, రక్తం పెరగడానికి, బ్రీతింగ్ సమస్య రాకుండా ఆఫ్ కేజీ పల్లిపట్టి, ఇవన్నీ పెట్టుకోడానికి ఒక బాక్స్, హార్లిక్స్ కలుపుకోడానికి కప్పు, స్పూన్ ఇస్తారు. గర్భిణులకు పౌష్టికాహారం అందించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే న్యూట్రిషన్ కిట్ ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కిట్పై రూ.1,962 ఖర్చు చేస్తున్నది.
మూడు దవాఖానల్లో పంపిణీ
జిల్లాలోని మంచిర్యాల గవర్నమెంట్ ఆస్పత్రి, చెన్నూర్, బెల్లంపల్లి దవాఖానల్లో కిట్ల పంపిణీని ప్రారంభిస్తాం. 1089 కిట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ముందు 27 వారాల నుంచి 34 వారాల గర్భిణులకు కిట్లు పంపిణీ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. త్వరలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది. గర్భిణుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు వారిలో రక్తహీనతను తగ్గించడమే కార్యక్రమ ముఖ్యోద్దేశం. – సుబ్బారాయుడు, డీఎంహెచ్వో, మంచిర్యాల