సూర్యాపేట : జిల్లా కేంద్రానికి నర్సింగ్ కళాశాల మంజూరు అయిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. అనువైన భవనం లభ్యమైతే ఈ సంవత్సరం నుంచే నర్సింగ్ కళాశాల ప్రారంభం కానుందని ఆయన ప్రకటించారు. ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నర్సుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నర్సింగ్ వృత్తికి మరే వృత్తి సాటి రాదన్నారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న రోగులను రక్తసంబంధీకులు సైతం దూరం పెట్లే తరుణంలో ఎన్నో కష్టాలను ఓర్చి సేవలందిస్తున్న వారు నర్సులని ఆయన కొనియాడారు. రోగాల బారిన పడి దుర్గంధం వస్తున్నా ఖాతరు చెయ్యకుండా అక్కున చేర్చుకున్న వారే నర్సులని ఆయన పేర్కొన్నారు.
వైద్యులతో సరి సమానంగా పోటీ పడి వైద్యులు వచ్చేసరికి రోగులను సంసిద్ధం చేయడంలో వారికి వారే సాటి అని ఆయన కితాబిచ్చారు. అలాంటి సేవలు అందిస్తున్నందునే కొవిడ్ సమయంలో అవార్డ్ సాధించుకున్నామని ఆయన గుర్తుచేశారు. డెలివరీ అంటేనే సిజేరియన్ గా పేరుబడ్డ పరిస్థితుల నుంచి సాధారణ ప్రసవాల డిమాండ్ పెరగడం చూస్తుంటే ప్రభుత్వ దవాఖానలో వైద్యులు, నర్సులు అందిస్తున్న సేవలే ప్రధాన కారణమని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, స్థానిక జడ్పీటీసీ జీడీ భిక్షం, పెనపహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, డీఎంహెచ్వో కోటాచలం, దవాఖాన సూపరింటెండెంట్ దండ మురళీధర్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, వైద్య ఉద్యోగుల సంఘం నాయకుడు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.