న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా పరిస్థితి క్రమంగా మెరుగుపడ్తున్నది. మొన్న ఆక్సిజన్ వాడకం తగ్గడంతో ప్రాణవాయువు నిల్వలు మిగిలిపోయాయని కేంద్రానికి వాపసు చేసిన ఢిల్లీ సర్కారు ఇప్పుడు హాస్పిటల్స్ లో బెడ్స్ మిగిలిపోతున్నాయని ప్రకటించింది. మొత్తం పడకల్లో 14,805 రోగులతో నిండి ఉన్నాయని, మరో 12,907 ఖాళీగా ఉన్నాయని తెలిసింది. దేశ రాజధానిలో గత కొద్దిరోజులుగా కరోనా తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. మంగళవారం కొత్త కేసులు 4,482 నమోదయ్యాయి. ఏప్రిల్ 5 తర్వాత ఇది అతితక్కువ పెరుగుదల. పరీక్షల్లో పాజిటివిటీ రేటు 6.89 శాతానికి పడిపోయింది. కాగా మరణాలు 265 సంభవించాయి. ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ), రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కోవిడ్ పతాక స్థాయికి చేరుకున్నప్పుడు ఏర్పాటు చేసిన వైద్యచికిత్సా సౌకర్యాలు ప్రస్తుతం సగం ఖాళీగానే ఉన్నాయి. కోలుకునేవారి సంఖ్య పెరగడంతో రోగుల్లో ఆత్మవిశ్వాసం కూడా ఇనుడిస్తున్నదని అధికారులు తెలిపారు.