హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): దేశంలో కాంగ్రెస్, బీజేపీ.. పేరుకు జాతీయ పార్టీలే తప్ప కుటిల రాజకీయాల్లో దొందూ దొందే అన్నట్టు తయారయ్యాయి. రెండు జాతీయ పార్టీలు దేశానికి అన్నంపెట్టే రైతులను క్షోభ పెడుతున్నాయి. తెలంగాణలో రైతులు యాసంగిలో పండించే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొండివైఖరితో ముప్పుతిప్పలు పెడుతుంటే.. ఏడాదికాలంగా కండ్లుమూసుకొని ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఉన్నట్టుండి రైతురాగం పాడటం మొదలుపెట్టారు. కారణం ఏమిటంటే.. ఆయన తొందర్లోనే రాష్ర్టానికి రానున్నారట. రైతులు ఏమీ ప్రశ్నించకుండా ముందరి కాళ్లకు బంధం వేయడమంటే అదే. ఇన్నాళ్లు ఎక్కడున్నారో తెలియదు.. ఏమైపోయారో కూడా తెలియదు.
తెలంగాణ రైతులు, వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై ఏడాదికాలంగా ఆందోళన చేస్తున్నా అజా లేరు. కేంద్రంపై పోరాటం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడూ కనిపించలేదు. ఇంతకాలానికి తీరిగ్గా వచ్చిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ.. ఎవరో తెలుగులో రాసిచ్చిన స్క్రిప్టును మంగళవారం ట్వీట్చేశారు. ‘టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులతో రాజకీయం చేస్తున్నాయి. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజను కొనాలి. అంతవరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది.’ అన్నది సదరు ట్వీట్ సారాంశం. దానితోపాటు ఇదే అంశంపై పోరాడుతున్న టీఆర్ఎస్పై ఓ పసలేని ఆరోపణ! గడపదాటకుండా.. ట్విట్టర్లో సరిగ్గా మూడంటే మూడే వాక్యాలు.. పదహారు పదాలు రాసేసి కంప్యూటర్లో ఎంటర్ నొక్కడంతో చేతులు దులిపేసుకొన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. ఉదయం నుంచి సామాజిక మాధ్యమంలో రాహుల్గాంధీ వైఖరిపైనా.. కాంగ్రెస్ పార్టీ తీరుపైన ట్వీట్ల యుద్ధం జరిగింది. ఎమ్మెల్సీ కవిత రాహుల్గాంధీకి దీటైన జవాబివ్వగా.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాకూర్ స్పందించారు. దానికీ కవిత రిటార్టిచ్చారు. తరువాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్, మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, హరీశ్రావు సామాజిక మాధ్యమం ద్వారానే కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఎండగట్టారు.
పార్లమెంట్లో నోరెత్తని రాహుల్
తెలంగాణలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనాలన్న డిమాండ్తో తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ.. ఏడాది కాలంగా రాష్ట్రంలో, ఢిల్లీలో అలుపు లేకుండా పోరాడుతూనే ఉన్నది. గత రెండు సమావేశాల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన చేస్తున్నారు. వెల్లోకి వెళ్లి నిరసన తెలియజేస్తున్నారు. ఈ ఆందోళనలకు రాహుల్గాంధీ ప్రత్యక్ష సాక్షిగా పార్లమెంట్ లోపలే ఉన్నారు. ఏ ఒక్క రోజైనా.. రాహుల్ కానీ, ఆయన పార్టీ నేతలు కానీ టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలకు సంఘీభావం తెలుపలేదు సరికదా.. కనీసం తెలంగాణ రైతుల పక్షాన నోరైనా విప్పలేదు. కాంగ్రెస్ నాయకత్వానికి ఇప్పటికి తెల్లారినట్టున్నది. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లపై నిందలేస్తున్న రాహుల్ తెలంగాణలో పండిన చివరి గింజ కొనే వరకు రైతుల తరఫున కాంగ్రెస్ పోరాడుతుందని కలరింగ్ ఇస్తున్నారు. మరి ఏడాదికాలంగా ఈ రాహుల్ గాంధీ.. రేవంత్రెడ్డి ఎక్కడికిపోయారని తెలంగాణ రైతులు ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందనే విషయాన్ని కాంగ్రెస్ నేత మధుయాష్కీ మరచిపోయినట్టున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్న మధుయాష్కీ అధికారంలోఉన్న బీజేపీకి వత్తాసు పలకడం సిగ్గుచేటని మండిపడ్డారు. చేతనైతే రైతుల కోసం కేంద్రంపై టీఆర్ఎస్ చేస్తున్న పోరాటంలో కలిసి రావాలని హితవు చెప్పారు.
మీ మాజీ అధ్యక్షుడిలా నేను పారిపోలేదు
ఉన్న మాట అనేసరికి ఊరుకోలేక పోయిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్.. ఓ ట్వీట్లో విమర్శలు గుప్పించడంతో ఆయనకూ కవిత గట్టిగానే రిటార్టిచ్చారు. మాజీ ఎంపీలను పార్లమెంట్లోకి అనుమతించరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మీ ఈ అహంకారమే ఇదే పార్లమెంట్లో మీ పార్టీని రెండంకెల స్థానాలకు పతనం చేసింది. నేను మీ పార్టీ మాజీ అధ్యక్షుడు (రాహుల్ గాంధీని ఉద్దేశించి) మాదిరిగా నియోజకవర్గాన్ని విడిచి పారిపోలేదు. గెలుపైనా, ఓటమైనా నిత్యం నా నియోజకవర్గ ప్రజల కోసమే పని చేస్తున్నా. అంతేకాదు.. మీ మాజీ అధ్యక్షుడి మాదిరిగా రెండు స్థానాల్లో పోటీ చేయలేదు’ అంటూ చురకలంటించారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల కోసమే పని చేస్తుందని, రైతులు పండించిన ప్రతి గింజ కొనేవరకు పోరాడుతుందని స్పష్టంచేశారు.
ట్విట్టర్లో కాదు.. పార్లమెంట్లో పోరాడండి: ఎమ్మెల్సీ కవిత
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించిన రాహుల్గాంధీపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులపై ప్రేమ ఉంటే ట్విట్టర్లో కాకుండా తమతో కలిసి పార్లమెంట్లో పోరాడాలని సూచించారు. తెలంగాణ ఎంపీలకు మద్దతుగా నిరసన తెలపాలని సవాలు చేశారు. పంజాబ్, హర్యానాలో మాదిరిగా తెలంగాణలోనూ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకే దేశం-ఒకే సేకరణ కోసం తమ ప్రభుత్వం పోరాడుతున్నదని అన్నారు.
రైతుల వేదన కాంగ్రెస్కు తెలుసా?: మంత్రి కేటీఆర్
రైతుల వేదన కాంగ్రెస్కు తెలుసా? అని ఆ పార్టీ ఎంపీ రాహుల్గాంధీని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. దేశ ప్రజలు 50 ఏండ్ల పైచిలుకు అధికారాన్ని ఇచ్చినా కాంగ్రెస్ చేసింది ఏమిటని నిలదీశారు. ధాన్యం కొనుగోళ్లపై రాహుల్గాంధీ చేసిన ట్వీట్కు మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ రీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ హయాంలో కనీసం 6 గంటల నిరంతర విద్యుత్తు కూడా ఇవ్వలేదని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ తప్పిదాలను తమ ప్రభుత్వం సవరిస్తూ, రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నదని పేర్కొన్నారు.
మొసలి కన్నీరు ఆపండి: రాహుల్కు మంత్రి హరీశ్రావు కౌంటర్
తెలంగాణ రైతులపై దొంగ ప్రేమ, మొసలి కన్నీరు ఆపాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీకి మంత్రి హరీశ్రావు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ నిజంగా తెలంగాణ రైతుల మేలు కోరుకొనే వాళ్లయితే పార్లమెంట్లో తమ ఎంపీలతో కలిసి ఆందోళన చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు పోసుకొంటున్న కేంద్రం తీరును ఎండగట్టాలన్నారు. ముందుగా వన్ నేషన్- వన్ ప్రొక్యూర్మెంట్ విధానంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్చేశారు.