హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. మొత్తం అన్ని స్థానాలను కైవసం చేసుకోగలమన్న ధీమాతో ఉన్న అధికార టీఆర్ఎస్ తరఫున మొదటిరోజు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో ముగ్గురు సిట్టింగ్ సభ్యులు కాగా, మెదక్ నుంచి ఒకరు, ఖమ్మం నుంచి మరొకరు మొదటిసారి మండలి బరిలోకి దిగుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానం నుంచి పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్రాజు, ఉమ్మడి వరంగల్ స్థానం నుంచి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మొదటిసారిగా ఖమ్మం నుంచి తాతామధు, మెదక్ నుంచి డాక్టర్ వంటేరి యాదవరెడ్డి నామినేషన్లు వేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ వేసిన పట్నం మహేందర్రెడ్డి అభ్యర్థిత్వాన్ని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్రెడ్డి, ప్రకాశ్గౌడ్, మెతుకు ఆనంద్ బలపరిచారు. మరో అభ్యర్థి శంభీపూర్ రాజు అభ్యర్థిత్వాన్ని కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలె యాదయ్య, కేపీ వివేకానంద బలపరిచారు. మహేందర్రెడ్డి రెండు సెట్లు, శంభీపూర్రాజు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.
ఖమ్మం స్థానం నుంచి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాత మధు రెండు సెట్ల నామినేషన్లు దాఖలుచేశారు. తొలుత పార్టీ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తాత మధుకు బీ ఫారమ్ అందజేశారు. నామినేషన్ పత్రాలలో పది మంది ప్రజాప్రతినిధులు ప్రతి పాదించాల్సి ఉండగా.. మంత్రి పువ్వాడ, శాసనసభ్యులు రాములు నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్యతోపాటు, ఖమ్మం నగర కార్పొరేటర్లు, జడ్పీటీసీ, ఎంపీపీలు ప్రతిపాదించారు.
వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానం నుంచి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి నాలుగుసెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి మొదటి సెట్ను, గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి రెండో సెట్ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ బీ గోపికి అందజేశారు. ఆ తరువాత ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వరంగల్ నగర మేయర్ జీ సుధారాణి ఒక సెట్ను, వరంగల్, ములుగు, జనగామ జిల్లా ప్రజాపరిషత్ల చైర్మన్లు గండ్ర జ్యోతి, కుసుమ జగదీశ్వర్, పాగాల సంపత్రెడ్డి కలిసి మరో సెట్ను పోచంపల్లి తరఫున నామినేషన్ పత్రాలను అందజేశారు.
తాతా మధు విద్యార్థి దశ నుంచే..
తాతా మధు.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. 2008లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తరువాత టీఆర్ఎస్లో చేరి క్రియాశీలక పాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన పలు ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జిగా వ్యవహరించి పార్టీకి విజయాలను అందించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం కోసం విశేష కృషి చేశారు. టీఆర్ఎస్లో చేరడానికి ముందు తాతా మధు అమెరికాలో తానా అసోసియేషన్లో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.
వైద్యుల కుటుంబం… గజ్వేల్కు అంకితం
డాక్టర్ వంటేరి యాదవరెడ్డి స్వగ్రామం క్యాసారం. ఆయన భార్య రమాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కాగా, ఇతర కుటుంబసభ్యులందరూ వైద్యులే. యాదవరెడ్డి కుమారుడు డాక్టర్ జయంత్రెడ్డి యూరాలజీ నిపుణుడు కాగా, కోడలు డాక్టర్ శ్వేత గైనకాలజీ నిపుణురాలు. కూతురు డాక్టర్ జ్యోతి కంటి వైద్య నిపుణురాలిగా గజ్వేల్ దవాఖానలో సేవలందిస్తున్నారు. అల్లుడు డాక్టర్ శంతన్రెడ్డి కూడా చిన్న పిల్లల వైద్య నిపుణులు. డాక్టర్ యాదవరెడ్డి 1978 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మొదట క్యాసారం సర్పంచ్గా ఎన్నిక కాగా, 2006 నుంచి 2010 వరకు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా సేవలందించారు. 2014అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన టీఆర్ఎస్లో చేరారు. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తరఫున ఎన్నికల ఏజెంటుగా వ్యవహరించారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ యాదవరెడ్డి సేవలకు సముచిత స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మెదక్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేశారు.