హైదరాబాద్ : సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు.
టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి, బీజేపీ అభ్యర్థి పానుగోతు రవికుమార్, టీడీపీ అభ్యర్థి మువ్వా రవికుమార్ తమ నామినేషన్లు దాఖలు చేశారు.
కరోనా నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ సాదాసీదాగా సాగింది. నిడమనూరు తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ రోహిత్ సింగ్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.
పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అన్నిపార్టీల అభ్యర్థుల రాకతో నిడమనూరులో ఎన్నికల కోలహలం కనిపించింది.
నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. పలువురు స్వతంత్ర అభ్యర్థులు, వివిధ చిన్నాచితకా పార్టీలకు చెందిన 20 మంది ఇప్పటికే 23 నామినేషన్లు దాఖలు చేశారు.
ఇవాళ మరో 30పైకి నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని సమాచారం.
జానారెడ్డి 11వ సారి..
కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా 11వ సారి నామినేషన్ దాఖలు చేశారు.
తొలిసారి ఆయన జనతా పార్టీ నుంచి 1978లో నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు 10 సార్లు పోటీ చేయగా ఏడుసార్లు గెలుపొందారు. 3 సార్లు ఓటమి చవిచూశారు.
పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే నిమ్మల రాములు చేతిలో, 1994లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్, 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యారు.